భారత్లో కరోనా కల్లోలం: 20వేలు దాటిన మరణాలు: మూడో స్థానంలో ఉన్నా ఆ రేటు తక్కువే
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అలాగే మరణాలు కూడా పెరుగుతున్నాయి. అయితే, కోలుకుంటున్నవారి సంఖ్య కూడా బాగా పెరుగుతుండటం శుభసూచకంగా కనిపిస్తోంది. తాజాగా మరోసారి దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి.
దేశంలో గత 24 గంటల్లో 22వేలకు పైగా కరోనా కేసులు బయటపడటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,23,503కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,61,338కు పెరిగింది. 4,41,868 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక మరణాల సంఖ్య 20,201కు చేరింది.
ఇక దేశంలో జులై మాసం ప్రారంభం నుంచి కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. జులై 1 నాటికి దేశంలో 5,85,493 కరోనా కేసులు నమోదు కాగా, కేవలం ఈ ఆరు రోజుల్లోనే లక్షా 34వేల కేసులు నమోదయ్యాయి. అంతేగాక, ఈ ఆరు రోజుల్లోనే దేశంలో 2760 మందికిపైగా రోగులు మరణించారు.
ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో కొనసాగుతోంది. మరణాలు కూడా ఎక్కువగానే సంభవిస్తున్నాయి. అయితే, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మనదేశంలో మరణాల రేటు తక్కువగానే ఉంది. అమెరికాలో ప్రతి 10వేల మందికి 3.97 మంది చనిపోగా.. యునైటెడ్ కింగ్డమ్లో 6.65 మంది చనిపోయారు. అయితే, మనదేశంలో మాత్రం 0.15శాతం మంది మాత్రమే మరణించారు.
అమెరికాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 3,041,950 ఉండగా, 133,041 మరణాలు సంభవించాయి. రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్లో 1,628,283 కేసులుండగా, 65,631 మంది మృతి చెందారు. యూకేలో 285,768 కేసులుండగా, 44,236 మంది మరణించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 11,779,956 కేసులు నమోదు కాగా, 541,753 మృతి చెందారు.