ప్రపంచంలో అతి తక్కువ కరోనా మరణాలు మనదేశంలోనే: కేంద్రం, 40వేలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాల్లోనే వేలాది మంది మరణించారు. అయితే, మిగితా దేశాలతో పోలిస్తే మనదేశంలో కరోనా మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉండటం గమనార్హం. కోవిడ్ మరణాల రేటు మనదేశంలో అత్యంత తక్కువగా ఉందని కేంద్రం ఆదివారం ప్రకటించింది.
Recommended Video
ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు 3.2 శాతం ఉందని, ఇది ప్రపంచంలోనే అతి తక్కువగా కావడం ఊరటనిచ్చే అంశమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో 10,633 మంది కోలుకున్నారని తెలిపారు. కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతం భారత్లో 26.59గా ఉందని వెల్లడించారు.
కాగా, 14 రోజుల క్రితం కేసుల రెట్టింపు 10.5రోజులుగా ఉండగా, ప్రస్తుతం 12 రోజులకు చేరిందని కేంద్రమంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో 10 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. వీరిలో దాదాపు 30వేల మందికి రెండోసారి పరీక్షలు నిర్వహించారు.
దేశంలో ఇప్పటి వరకు 40,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 11,010 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 27,744 మంది ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా బారినపడి 1326 మంది మరణించారు. కాగా, మహారాష్ట్రలో అత్యధికంగా 12,296 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 2వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 9,775 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మొత్తం మహారాష్ట్రంలో 521 మంది చనిపోయారు.