11 రోజుల్లో 10 లక్షలు: దేశంలో 50 లక్షలు దాటిన కరోనా కేసులు..
దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కేసులు 5 మిలియన్ దాటాయి. అమెరికా తర్వాత 5 మిలియన్ కేసులు దాటిన దేశంగా భారత్ నిలిచింది. అయితే గత 11 రోజుల్లో 10 లక్షల కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం రోజున దేశంలో 50 లక్షల కరోనా వైరస్ కేసుల మార్క్ దాటింది.
తెలంగాణలో వెయ్యికి చేరువగా కరోనా మరణాలు: మళ్లీ మొదటికి: వేలల్లో కేసులు
మంగళవారం ఒక్కరోజే 90 వేల కేసులు వచ్చాయి. ఇక మరణాలు కూడా 1275 వచ్చాయి. ఒక్కరోజుల్లో ఇన్నీ మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. కరోనా వైరస్ తొలినాళ్లలో మిలియన్ కేసులు నమోదవడానికి 167 రోజుల సమయం పట్టింది. అయితే ఆ సమయంలో లాక్ డౌన్ కఠినంగా అమలు చేయడం, రాకపోకలకు ఆంక్షలు ఉండటంతో కేసులు తక్కువగానే వచ్చేవి. కానీ మిగిలిన 4 మిలియన్ కేసులు మాత్రం కేవలం 41 రోజుల్లోనే వచ్చాయి. ప్రపంచంలోనే వేగంగా కరోనా వైరస్ భారత్లో వ్యాప్తి చెందుతోంది.
మంగళవారం 90 వేల 789 పాజిటివ్ కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 50 లక్షల 14 వేల 395కి చేరింది. సెప్టెంబర్ నెలలోనే 1.3 మిలియన్ కేసులు వచ్చాయి. అంటే మొత్తం కేసుల్లో 27 శాతం అని లెక్కలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో 515 కరోనా మరణాలు నిన్న ఒక్కరోజులో సంభవించాయి. యూపీలో 113, కర్ణాటకలో 97 మంది, పంజాబ్ 90 మంది, ఏపీ 69 మంది, తమిళనాడు 68 మంది, బెంగాల్ 59 మంది చొప్పున చనిపోయారు. ఇటు సోమవారం 80 వేల కేసులు రాగా.. మంగళవారం 10 వేల కేసులు పెరిగాయి.