బ్యాడ్ న్యూస్ : ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే ఇప్పుడే చేయండి...తర్వాత డిస్కౌంట్లు ఉండవు
పండగ సీజన్.. షాపింగ్ చేద్దామనుకుంటున్నారా.... ఇప్పటికే భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి షాపింగ్ మాల్స్. ఇక వాటికంటే మరింత డిస్కౌంట్తో కస్టమర్లను పలకరిస్తున్నాయి ఈ-కామర్స్ సైట్లు. ఒక జత బట్టలు కొనాలంటే షాపింగ్ మాల్కు వెళ్లి కొనాలి. అదే ఇంట్లో కూర్చొని ఎంచక్కా ఆన్లైన్లోనే మీ షాపింగ్ చేసుకోవచ్చు. పైగా షాపింగ్ మాల్స్ కంటే ఆన్లైన్ షాపింగ్లోనే భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అందుకే కస్టమర్లు షాపింగ్ కోసం ఆన్లైన్ వెబ్సైట్లనే ఆశ్రయిస్తున్నారు. భారీ డిస్కౌంట్లు ఇప్పుడే ఉన్నాయి కాబట్టి మీరు షాపింగ్ చేసుకోవాలంటే త్వరగా చేసుకోండి. ఎందుకంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ-కామర్స్ సైట్లో ఇలాంటి భారీ డిస్కౌంట్లు ఉండవు.
ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ-కామర్స్ పాలసీ అమల్లోకి వస్తే ఆన్లైన్ షాపింగ్ చేయడం కష్టమే అవుతుందని పలు ఈ-కామర్స్ వెబ్సైట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొత్త నిబంధనలతో భారీ డిస్కౌంట్లకు బ్రేక్ పడనుంది. దీంతో స్థానిక వ్యాపారులకు భారీగా లబ్ధి చేకూరుతుంది. ఆన్లైన్ షాపింగ్ సైట్లు భారీ డిస్కౌంట్లు ఇచ్చి తమ పొట్టకొడుతున్నాయని ప్రభుత్వం దృష్టికి వ్యాపారులు తీసుకొచ్చారు. దీనిపై ఆలోచన చేసిన ప్రభుత్వం ఈ కొత్త పాలసీని ప్రవేశపెట్టనుంది.
ఇక కొత్త పాలసీ ఫిబ్రవరిలో అమలు చేస్తే తమ వస్తువుల అమ్మకాలపై భారీ దెబ్బ పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్ కార్టు, అమెజాన్. ప్రభుత్వం తీసుకొచ్చే మార్పులు పరిశ్రమ అభివృద్ధికి దోహదపడేలా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు ఈ-కామర్స్ షాపింగ్ సంస్థలతో పాటు ఫుడ్ డెలివరీ చేసే జొమాటో, ఫుడ్ పాండా, పేటీఎం, ఫ్రీఛార్జ్ లాంటి ఆన్లైన్ ప్లాట్ ఫాంలకు ఇదే తరహా పాలసీని తీసుకురానున్నట్లు సమాచారం.
ఇక కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం ఏదైనా కంపెనీ ఒక ప్రాడక్ట్ను మ్యానుఫాక్చర్ చేస్తే 25శాతానికి పైగా ఉత్పత్తులను ఒకే కంపెనీకి విక్రయించేందుకు వీలుపడదు. క్యాష్ బ్యాక్ ఆఫర్లపై కూడా నిబంధనలను కఠినతరం చేసింది ప్రభుత్వం. ఇక ఫోన్ల విషయానికి వస్తే ఈ-కామర్స్ సంస్థలు ఫలానా ఫోనును తమ సంస్థ ద్వారా ఆన్లైన్లో కొనేలా ముందుగానే ఫోను కంపెనీతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. కస్టమర్లు ఆ ఒక్క ఈ-కామర్స్ సంస్థ నుంచే ఫోన్లను కొనాల్సి వస్తుంది. ఇక దీనికి కూడా చెక్ పెట్టనుంది ప్రభుత్వం.