గుడ్న్యూస్: కరోనాకు తొలి దేశీ వ్యాక్సిన్.. ఈవారంలోనే హ్యూమన్ ట్రయల్స్.. హైదరాబాద్ సంస్థే..
కరోనా వైరస్ భయానకంగా వ్యాపిస్తుండటంతో తిరిగి సంపూర్ణ లాక్ డౌన్ విధించే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేస్తున్న వేళ ఓ అద్భుతమైన శుభవార్త. కొవిడ్-19 విరుగుడు కోసం రూపొందించిన స్వదేశీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ''కొవ్యాక్సిన్'' పేరుతో రూపొందిన వ్యాక్సిన్ ను జులై మొదటి వారం నుంచే మనుషులపై ప్రయోగించనున్నారు. అది సక్సెస్ అయితే, అతి కొద్ది కాలంలోనే ప్రపంచానికి కరోనా పీడ విరగడయ్యే అవకాశాలున్నాయి.
చైనాకు షాక్..బలూచిస్తాన్లో సీన్ రివర్స్.. పాక్ స్టాక్ ఎక్సేంజ్పై దాడి బీఎల్ఏ పనే.. భారత్ ప్రమేయం?
తొలి స్వదేశీ వ్యాక్సిన్..
స్వదేశీ కరోనా వ్యాక్సిన్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్).. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ కంపెనీతో జట్టు కట్టింది. వ్యాక్సిన్ తయారీలో ప్రక్రియలో పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) సహకరిచింది. కరోనా వైరస్ కు సంబంధించిన టెక్నాలజీని ఎన్ఐవీ.. భారత్ కంపెనీకి బదిలీచేసిన తర్వాత ప్రయోగాలు విజయవంతంగా సాగాయి. ఇప్పుడు..
చైనా భుజం మీదుగా జగన్ పైకి తూటా.. మోదీ సారథ్యానికి రఘురామ జేజేలు.. ఎంపీ అనూహ్య చర్య..
క్లినికల్ ట్రయల్స్ షురూ..
కొవ్యాక్సీన్ను మనుషులపై ప్రయోగించేలా.. ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్కు సంబంధించి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) సోమవారం అనుమతులు ఇచ్చింది. జులై మొదటి వారం నుంచే దేశవ్యాప్తంగా కొవ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఐసీఎంఆర్ ఇప్పటికే ఏర్పాటు పూర్తిచేసింది. అన్నీ అనుకున్నట్లే జరిగితే, ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసిన కొవిడ్-19కు విరుగుడు మందును ముందుగా ఇండియానే రూపొందించినట్లవుతుంది.
వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలి..
ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినపడ్డ వాళ్ల సంఖ్య సోమవారం నాటికి 1.03కోట్లకు పెరిగింది. మరణాల సంఖ్య 5లక్షలు దాటింది. ప్రపంచ రికార్డును మరోసారి సవరిస్తూ.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1.90 లక్షల కొత్త కేసులు సోమవారం వెలుగులోకి వచ్చాయి. సెప్టెంబర్ నాటికి కేసులు, మరణాలు ఇంకా పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం కీలక రిక్వెస్ట్ చేసింది. కొవిడ్-19 వ్యాక్సిన్ ను అత్యవసర వస్తువుగా పరిగణించాలని, భూమ్మీద ప్రతి ఒక్కరికీ అది అందేలా ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని 18 మంది నోబెల్ గ్రహీతలు, వంద మంది ప్రముఖులు విజ్ఞప్తి చేశారు.
Recommended Video
దేశంలో అదే తీరు..
మన దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కంట్రోల్ లోకి రాలేదు. ప్రతి రోజు 20 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం దాకా కొత్తగా 19,459 కేసులు, 380 మరణాలు నమోదయ్యాయి. మొత్తంగా కేసుల సంఖ్య 5.67 లక్షలకు, మరణాల సంఖ్య 17వేలకు చేరువైంది. ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే అత్యధికంగా 3628 కొత్త కేసులు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 83,98,362 కరోనా టెస్టులు నిర్వహించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.