మరో గూడ్ న్యూస్: ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్కు కేంద్రం ఓకే, దీనికి అదీ ప్లస్...
కరోనా వైరస్ నివారణ కోసం టీకాలు వస్తూనే ఉన్నాయి. స్వదేశీ/ విదేశీ టీకాలు మరో రెండు మూడు నెలల్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే మరో బూస్ట్ ఇచ్చే విషయం తెలిసింది. దేశంలో రూపొందుతోన్న హోమ్ మేడ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ కూడా మంచి ఫలితాలు అందజేస్తే.. కరోనా మహమ్మరీని పారదోలడం ఈజీ కానుంది.
పుణెలోని జెన్నొవాకు చెందిన ఎంఆర్ఎన్ఏ 'హెచ్జీసీ019' వ్యాక్సిన్ హ్యుమన్ ట్రయల్స్కు అనుమతి ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ వ్యాక్సిన్ 2.8 డిగ్రీ సెల్సియస్ వద్ద రెండు నెలల పాటు స్థిరంగా ఉంటుందని తెలిపింది. హ్యుమన్ ట్రయల్స్లో సానుకూల ఫలితాలు వస్తే.. ఈ వ్యాక్సిన్ భారతదేశ పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. టీకాలను ఫ్రీజుల్లో పెట్టాల్సిన అవసరం కూడా లేకపోతోంది. దేశంలోని కొన్ని ప్రాంతాలు.. మారుముల ప్రాంతాలు/ ఏజెన్సీ ప్రాంతాల్లో నిల్వ చేయడం కష్టమనే సంగతి తెలిసిందే.
వ్యాక్సిన్ సింథటిక్ ద్వారా శరీరంలో ప్రోటీన్ తయారు చేయడానికి పరమాణు సూచనలను కలిగి ఉంటుంది. ఈ వ్యాక్సిన్ సురక్షితం అని.. ఇన్ ఫెక్షన్ కాదు అని తెలిపింది. అంతేకాదు 90 శాతం సమర్థంగా పనిచేస్తున్నాయని చెబుతోన్న ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు.. ఎంఆర్ఎన్ఏ మోడల్ టీకాలను వాడతాయని తెలిపింది.