2021 డిసెంబర్ నాటికి అంతరిక్షంలోకి మహిళ సహా భారత వ్యోమగాములు
న్యూఢిల్లీ/శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మరో మూడేళ్లలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టనుంది. 2021 డిసెంబర్ నాటికి భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాలని నిర్షేశించుకున్నట్లు ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. గగన్యాన్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే స్వతంత్రంగా మనుషులను అంతరిక్షంలోకి పంపించిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుందని చెప్పారు.
గత ఏడాది స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ 2022 నాటికి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు చెప్పారు. ఇప్పుడు ఇస్రో చైర్మన్ శివన్ 2021 డిసెంబర్ నాటికి పంపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
గగన్యాన్ ప్రాజెక్టు ద్వారా పంపే వ్యోమగాములకు తొలుత బారత్లో, తర్వాత రష్యాలో శిక్షణ ఇప్పిస్తామని శివన్ చెప్పారు. వ్యోమగాముల బృందం పూర్తిగా పురుషులతో కూడున్నది కాదని, ఈ బృందంలో ఓ మహిళ కూడా ఉంటుందని తెలిపారు. గగన్యాన్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్లు కేటాయించిందని చెప్పారు. ముగ్గురు వ్యోమగాములను వారం రోజుల పాటు అంతరిక్షంలోకి పంపిస్తామన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రష్యా, ఫ్రాన్స్లతో భారత్ ఒప్పందం కుదుర్చుకుందన్నారు.
అలాగే, ఈ ఏడాది ఏప్రిల్లో చంద్రుడిపైకి చంద్రయాన్ 2ను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శివన్ తెలిపారు. ఇస్రో తొలుత చంద్రయాన్ 2ను జనవరి నుంచి ఫిబ్రవరి 16 మధ్యలో చేపడతామన్నారు. అయితే కొన్ని పరీక్షలు పూర్తికాకపోవడం వల్ల తేదీని మార్చారని, మార్చి 25 నుంచి ఏప్రిల్ చివరి నాటికి ఈ ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. పదేళ్ల క్రితం పంపిన చంద్రయాన్ 1కు ఇది అడ్వాన్స్డ్ వర్షన్ అన్నారు.