లాహోర్ నుంచి కనిపించేంత పెద్ద జెండా!
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించేందుకు సరిహద్దు భద్రతా(బిఎస్ఎఫ్) సిబ్బంది సన్నాహాలు చేపట్టారు. పంజాబ్లోని అట్టారీ-వాఘా సరిహద్దుల్లో 350 అడుగుల ఎత్తైన జాతీయ జెండాను ఏర్పాటుచేయనున్నట్లు అధికారులు తెలిపారు.
కాగా, ఈ జెండా ప్రత్యేకతమేటిటంటే.. పాకిస్థాన్లోని లాహోర్ నుంచి చూస్తే ఈ జెండా కన్పించేంత ఎత్తులో దీన్ని ఆవిష్కరించనున్నట్లు బీఎస్ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ ఇన్స్పెక్టర్ జనరల్ అశోక్ కుమార్ యాదవ్ తెలిపారు.
వాఘా సరిహద్దుకు 18 కిలోమీటర్ల దూరంలో అమృతసర్, లాహోర్ ఉంటాయని.. రెండు ప్రాంతాల నుంచి చూస్తే.. ఈ త్రివర్ణ పతాకం కనబడుతుందని తెలిపారు. దేశంలో ఎత్తైన జెండా ఇదే అవుతుందని చెప్పారు.
2017 జనవరి నాటికి దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతేగాక. జెండా చుట్టూ సీసీ కేమెరాలను కూడా ఏర్పాటుచేయనున్నారు. ప్రస్తుతం ఎత్తైన జెండా ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఉంది.
293 అడుగుల ఎత్తులో ఉన్న ఈ జెండాను కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ జనవరిలో ఆవిష్కరించారు. అయితే మరమ్మతుల కోసం తర్వాత దీన్ని దించేశారు.