సొగసుగా సొరంగ మార్గం: శ్రీనగర్ - జమ్ము ట్రయల్ రన్ ఓకే..
జమ్మూకాశ్మీర్ వాసుల చిరకాల వాంఛ.. ఆకాంక్ష నిజం కాబోతున్నది. జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ రద్దీతో తలెత్తుతున్న సమస్యలకు చరమ గీతం పాడే సమయం ఆసన్నమైంది.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ వాసుల చిరకాల వాంఛ.. ఆకాంక్ష నిజం కాబోతున్నది. జమ్ము - శ్రీనగర్ జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ రద్దీతో తలెత్తుతున్న సమస్యలకు చరమ గీతం పాడే సమయం ఆసన్నమైంది. హిమాలయ పర్వత శ్రేణులకు దిగువన అత్యాధునిక వసతులతో సొరంగ మార్గంలో ప్రయాణం త్వరలో సాకారం కాబోతున్నది. నిత్యం చల్లని వాతావరణంలో ఉల్లాసంగా సాగిపోయే ప్రయాణం గురించి ఊహించుకుంటేనే మానసికోల్లాసాన్ని అందించే అనుభూతి.
అత్యంత అద్భుతమైన ఈ సొరంగ మార్గం అందుబాటులోకి రావడంతోపాటు ప్రజల కష్టాలు తీర్చబోతోంది. దేశంలోనే అతి పొడవైన ఈ జంట సొరంగాల మార్గం ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలఖారులోగా ప్రారంభించే అవకాశం ఉంది.
286 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న జమ్మూ - శ్రీనగర్ నాలుగు లైన్ల జాతీయ రహదారిలో ఈ సొరంగ మార్గం నిర్మిస్తారు. వాహనాల రాకపోకల విషయమై ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 15వ తేదీ వరకు ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసినట్లు సొరంగ మార్గం నిర్మాణ సంస్థ ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జేఎస్ రాథోడ్ తెలిపారు. భారీ వ్యయంతో నిర్మాణం చేపట్టిన ఈ సొరంగ రోడ్డులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.
ప్రత్యేకతలు అనేకం
ఈ సొరంగ మార్గంతో రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలు జమ్ము, శ్రీనగర్ మధ్య రెండున్నర గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. చెనానీ - నష్రీ మధ్య ఉన్న 41 కిలోమీటర్ల దూరం 10.9 కిలోమీటర్లకు తగ్గిస్తుంది. తత్ఫలితంగా రోజుకు రూ. 27 లక్షల విలువైన ఇంధనం ఆదా అవుతుంది. దేశంలోనే మొదటిసారి అంతర్జాతీయ స్థాయి సమీకృత సొరంగ మార్గ నియంత్రణ విధానం అనుసరించారు. ఈ మార్గంలో ఆటోమేటిక్గా పనిచేసే వెలుతురు, అగ్నిమాపక, సిగ్నళ్లు, విద్యుత్, సమాచార వ్యవస్థ ఏర్పాటు చేస్తారు.
అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణం
ఈ సొరంగ మార్గం పూర్తిగా అంతర్జాతీయంగా సురక్షిత ప్రమాణాలతో అన్నివేళ్లలోనూ పనిచేస్తుంది. ఈ రూట్లో ప్రయాణాలను అనుమతినిస్తే మంచు, హిమపాతంతో జాతీయ 'రహదారి-1ఏ'పై పట్నిటోప్ వద్ద నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టినట్లే. ఈ మార్గంలో వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సహాయపడేలా అత్యాధునికంగా కంప్యూటరీకరించిన కేంద్రం అందుబాటులో ఉంటుంది. అధునాతన ఎస్ఓఎస్ విధానంలో ఎక్కడి నుంచైనా ఈ కేంద్రంతో మాట్లాడే వీలు ఉంది.
సొరంగ మార్గమంతా సీసీటీవీ కెమెరాలు
ప్రతి 75 మీటర్ల దూరానికి ఒక సీసీటీవీ కెమెరా చొప్పున సొరంగ మార్గమంతా 124 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అంతే కాదు సొరంగ మార్గంలో నిరంతరం 24 గంటల పాటు పని చేసేలా మూడంచెల వ్యవస్థలో లైట్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో నిర్ణీత ఎత్తు గల వాహనాలను మాత్రమే అనుమతిని ఇస్తారు. సొరంగ మార్గానికి ఇరువైపులా వాహనాలను తనిఖీ చేస్తారు. ఈ మార్గంలో మండే వస్తువులను అనుమతించరు.
పని చేయనున్న మొబైల్ ఫోన్ నెట్ వర్క్ల్లు
ఈ సొరంగ మార్గం ప్రభుత్వ రంగ టెలికం సర్వీస్ ప్రొవైడర్ బీఎస్ఎన్ఎల్ సహా కొన్ని టెలికం సంస్థల మొబైల్ నెట్ వర్క్ లు పని చేస్తాయి. ఏం చక్కా ఎఫ్ఎం రేడియో కూడా వినొచ్చు. 2011 మార్చి 23వ తేదీన నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో సొరంగ మార్గం నిర్మాణం మొదలైంది. 9.2 కిలోమీటర్ల దూరం గల ఈ రూట్ నిర్మాణానికి రూ.3,720 కోట్లు ఖర్చయ్యాయి. అంతే కాదు ఈ సొరంగ మార్గం పరిధిలో గరిష్ఠంగా 50 కిలోమీటర్లకు మించి వేగాన్ని అనుమతించరు.