దేశంలో 80 లక్షలు దాటిన కరోనా కేసులు: కొత్త కేసుల కంటే కోలుకున్నవారే ఎక్కువ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. అదే సమయంలో రికవరీ రేటు పెరుగుతుండటం గమనార్హం. గత 24 గంటల్లో 10,75,760 కరోనా పరీక్షలను నిర్వహించగా.. 49,881 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 80,40,203కు చేరింది. ఇక గత 24 గంటల్లో 517 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 1,20,527కి చేరింది.
ఏపీలో 3వేల లోపే కొత్త కరోనా కేసులు: కర్నూలులో అత్యల్పం, 26వేలకు దిగొచ్చిన యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 56,480 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 73,15,989 మంది కోలుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 6,03,687 క్రియాశీల కేసులు ఉన్నట్లు పేర్కొంది. దాదాపు 90.99 శాతం మంది కరోనా నుంచి కోలుకుంటున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
మొత్తం కేసుల్లో కేవలం 7.51 శాతం మాత్రమే యాక్టివ్ కేసులున్నట్లు తెలిపింది. మరణాల రేటు 1.50 శాతానికి తగ్గిందని చెప్పింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 10,25,23,469 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో రోజుకు 15 లక్షల టెస్టులు చేసే సామర్థ్యం ఉన్నట్లు తెలిపింది.
టెస్టుల సంఖ్య భారీగానే ఉన్నప్పటికీ పాజిటివిటీ రేటు తగ్గుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటివరకు కరోనా పాజిటివిటీ రేటు 7.54 శాతంగా ఉండగా, గత తొమ్మి రోజుల్లో జరిపిన కోటి పరీక్షల్లో పాజిటివిటీ రేటు 4.64 శాతం మాత్రమే ఉందని స్పష్టం చేసింది.
కాగా, దేశ వ్యాప్తంగా కరోనా నిర్ధారణ కేంద్రాలను భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. జనవరి 23వరకు దేశంలో ఒకే ఒక్క టెస్టింగ్ కేంద్రం ఉండగా, మార్చి 23 వరకు ఆ సంఖ్య 160కి పెరిగింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపేందుకు 2018 కేంద్రాలకు ఐసీఎంఆర్ అనుమతిచ్చింది. వీటిలో 1127 ప్రభుత్వ ల్యాబ్లు ఉండగా, 981 ల్యాబ్లు ప్రైవేటు ఆధ్వర్యంలో కరోనా నిర్దారణ పరీక్షలు చేపడుతున్నాయి. వీటి ద్వారా రోజుకు 15 లక్షల కరోనా టెస్టులు నిర్వహించే సామర్థ్యం ఉండటం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక టెస్టులు నిర్వహించిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇక టెస్టుల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది.