కాలుష్యంతో భారతీయుల ఆయుష్షు ఎంత తగ్గిపోయిందో తెలిస్తే షాక్ - చికాగో వర్సిటీ లైఫ్ ఇండెక్స్..
మన దేశంలో ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నేటి యువతకు తెలిసిన సీజన్లు మూడే. అందులో ఒకటి వేసవి, రెండు వర్షాకాలం, మూడోది కాలుష్య సీజన్ అంటే అతిశయోక్తి కాదు. ఉత్తరాది రాష్ట్రాల్లో పెరిగిపోతున్న కాలుష్య స్ధాయిలకు ఇదో నిదర్శనం. వేసవి, వర్షకాలంతో పోలిస్తే శీతాకాలంలో అక్కడ కాలుష్య స్ధాయిలు చాలా అధికంగా ఉంటున్నాయి. దీంతో శీతాకాలం వస్తుందంటే చాలు వారు వణికిపోయే పరిస్ధితి. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఈ శీతాకాల కాలుష్యాన్ని అరికట్టలేక పోతున్నాయి. ఇలా పెరిగిపోతున్న కాలుష్య స్ధాయిలు ప్రజల ఆయుర్దాయంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతున్నాయనే అంశంపై తాజాగా అమెరికాలోని చికాగో యూనివర్సిటీ లైప్ ఇండెక్స్ ఫలితాలు షాకింగ్ గా ఉన్నాయి.
కరోనా ఎఫెక్ట్ ... లాక్ డౌన్ తో ఊపిరి తీసుకుంటున్న భూమి .. తగ్గుతున్న కాలుష్యం
ప్రమాదం అంచున నలుసు కాలుష్యం..
ప్రపంచంలోనే రెండో అత్యధిక జనాభా కలిగిన భారత దేశంలో కాలుష్యం కూడా అంతే స్దాయిలో ప్రబలుతోంది. ముఖ్యంగా మన కంట్లో పడే నలుసులు గాల్లో గతంలో ఎన్నడూ లేనంత స్ధాయిలో చేరిపోవడంతో కాలుష్యం ప్రమాద కర స్ధాయికి చేరుకుంది. తాజాగా అమెరికాలోని చికాగో యూనివర్సిటీలోని ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ఎయిర్ లైఫ్ క్వాలిటీ ఇండెక్స్ లోనూ ఇదే స్పష్టమైంది. భారత్ లోని 1.4 బిలియన్ జనాభా ప్రపంచ ఆరోగ్య సంస్ధ నిర్దేశించిన కాలుష్య స్ధాయిలు మించిన ప్రాంతాల్లోనే నివసిస్తున్నట్లు తేలింది. అలాగే భారత్ నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం చూసినా 84 శాతం మంది ఈ నలుసు కాలుష్యం ఉన్న ప్రాంతాల్లోనే ఉంటున్నట్లు నిర్ధారణ అయింది.
భారీగా తగ్గిపోయిన ఆయుష్షు..
భారత్ లోని ప్రధాన నగరాల్లో అంతకంతకూ పెరిగిపోతున్న నలుసు కాలుష్యం వల్ల దేశంలో నివసిస్తున్న ప్రజల సగటు ఆయుష్షు భారీగా తగ్గిపోతున్నట్లు చికాగో వర్సిటీ లైఫ్ ఇండెక్స్ పేర్కొంది. దీని ప్రకారం భారత్ లో నలుసు కాలుష్యం వల్ల ప్రజల సగటు ఆయుర్దాయం 5.2 సంవత్సరాల మేర తగ్గినపోయినట్లు ఇండెక్స్ చెబుతోంది. అంటే ఫ్రతీ భారతీయుడు తన జీవితకాలంలో కాలుష్యం వల్లే ఐదేళ్లకు పైగా కోల్పోయినట్లు తేలింది. అత్యధికంగా కాలుష్య స్ధాయిలు అధికంగా ఉన్న లక్నోలో నివసిస్తున్న వారి ఆయుర్దాయం కాలుష్యం కారణంగా ఏకంగా పదేళ్లు తగ్గిపోయినట్లు చికాగో వర్సిటీ ఇండెక్స్ తెలిపింది.
ఈ నగరాలపై తీవ్ర ప్రభావం...
దేశంలోని ప్రధాన నగరాలపై ముఖ్యంగా ఉత్తరాదిలో ఉన్న నగరాలపై నలుసు కాలుష్యం ప్రభావం చాలా అధికంగా ఉంది. యూపీ రాజధాని లక్నోలో అత్యధికంగా కాలుష్యం కారణంగా ప్రజల ఆయుర్దాయం పదేళ్లు తగ్గిపోగా... మెగాసిటీలైన ఢిల్లీ, కోల్ కతా నగరాల్లో నివసించే వారి ఆయుష్షు అయితే ఏకంగా 8 ఏళ్లు తగ్గిపోయినట్లు నిర్ధారణ అయింది. 1998 నుంచి చూస్తే ఈ నలుసు కాలుష్యం ఏటా సగటున 42 శాతం పెరుగుతోందని చికాగో వర్సిటీ ఇండెక్స్ చెబుతోంది.
కరోనా వేళ ఊరట...
తాజాగా భారత్ లో కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో మాత్రం ఈ నలుసు కాలుష్యం స్ధాయిలు భారీగా తగ్గాయని చికాగో వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా దేశంలో ప్రధాన నగరాలైన చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్ కతా, ముంబైలో వాయు కాలుష్యం 54 శాతం మేర తగ్గిందని, దీని వల్ల 630 మంది ప్రాణాలు దక్కాయని యూకేకు చెందిన శాస్త్రవేత్తల బృందం తాజాగా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. మిగతా నగరాలతో పోలిస్తే ఢిల్లీ పై మాత్రం కాలుష్యం ప్రభావం ఇంకా ఉందని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. లాక్ డౌన్ లోనూ కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది ప్రథమార్దంలో 24 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, 5.8 శాతం జీడీపీ కూడా కోల్పోయామని అవి సూచిస్తున్నాయి.