భారత్ ఆత్మవిశ్వాసం అత్యున్నత శిఖరాలకు చేరుకుంది: చివరి ప్రసంగంలో మోడీ
దేశం ఆత్మవిశ్వాసం అత్యున్నత శిఖరానికి చేరుకుందని ఇది అభివృద్ధికి తొలి అడుగు అని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 16వ లోక్సభలో తన చివరి ప్రసంగం చేశారు ప్రధాని నరేంద్రమోడీ. ఈ 16వ లోక్సభ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్న ప్రధాని నరేంద్రమోడీ... ఈ సభ చాలామంది మహిళా ప్రజాప్రతినిధులు వేదికగా నిలిచిందన్నారు. అదికూడా గత 15 లోక్సభల్లో ఎన్నడూ లేనివిధంగా అత్యధికంగా మహిళా ఎంపీలు ఈ 16వ లోక్సభకు ఎంపికయ్యారని ప్రధాని కొనియాడారు. 44 మంది మహిళలు ఎంపీలుగా ఎన్నుకోబడి లోక్సభలో అడుగుపెట్టారని మోడీ వివరించారు.
219 బిల్లులు సభలో ప్రవేశ పెడితే 203 బిల్లులకు ఆమోదం
ప్రపంచం ఈ రోజు గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించుకుంటోందని చెప్పిన ప్రధాని మోడీ... గ్లోబల్ వార్మింగ్పై పోరాటం చేసేందుకు భారత్ అంతర్జాతీయ సౌర సమాఖ్యలో తన గొంతును బలంగా వినిపించిందని గుర్తుచేశారు. నల్లధనం అవినీతిలను ఉక్కుపాదంతో అనగదొక్కేలా తెచ్చిన కఠిన చట్టాలకు ఈ సభ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. చరిత్రాత్మక జీఎస్టీ బిల్లుకు కూడా వేదికగా 16వ లోక్సభ నిలిచిందన్నారు. ఇక ప్రధానిగా తన హయాంలో 219 బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెడితే అందులో 203 బిల్లులు పాస్ అయ్యాయని వివరించారు.
అందరి వేతనాలతో పాటే ఎంపీల వేతనాలు కూడా పెరుగుతాయి
ఒకప్పుడు ఎంపీలు తమ జీతాలను తామే నిర్ణయించుకుంటారన్న ఆరోపణలు ఉండేవని... తమ ప్రభుత్వం వచ్చాక అందరి వేతనాలు పెరిగిన సమయంలోనే ఎంపీల వేతనాలు కూడా పెరిగేలా వ్యవస్థను తయారుచేశామని చెప్పారు. జీతాలను నిర్ణయించే బాధ్యతల నుంచి ఎంపీలకు విముక్తి కలిగించినట్లు చెప్పారు ప్రధాని. సభలో ప్రతిపక్షనేతగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోడీ...కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తనను కౌగలించుకుని కన్నుగీటిన విషయాలను మరోసారి గుర్తుచేశారు. తొలిసారిగా కళ్లు తప్పుచేస్తాయని ఈ సభలోనే తాను తెలుసుకున్నట్లు ప్రధాని ఛలోక్తులు విసిరారు.
సభలో రాహుల్ లేకపోవడంపై ప్రధాని సెటైర్లు
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంపై మోడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అటాక్ చేశారు. చాలా విమానాలు సభలోనే ఎగురుతున్నాయని విమర్శించారు. రాహుల్ గాంధీని అటాక్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ... భూకంపం వస్తుందనే వార్త విన్నాను కానీ.. ఆయన మాత్రం రాలేదని పరోక్షంగా సభలో లేని రాహుల్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు ప్రధాని నరేంద్ర మోడీ. పార్లమెంటులో తనను మాట్లాడనీయరని ఒకప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడు వ్యాఖ్యలు చేశారు. తను మాట్లాడటం మొదలు పెడితే భూకంపం వస్తుందని రాహుల్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఉద్దేశించి ప్రధాని రాహుల్ పై నిప్పులు చెరిగారు.