ఆగస్టులో మరింతగా పెరిగిన పట్టణ నిరుద్యోగితా, వ్యవసాయం మినహా అన్ని రంగాలపై పెను ప్రభావం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా వ్యవస్థలన్నీ దెబ్బతిన్నాయి. దీంతో నిరుద్యోగిత ఎన్నడూ లేనంతగా పెరిగిపోతోంది. స్థూల జాతీయోత్పత్తి కూడా భారీగా పతనమైన విషయం తెలిసిందే. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తాజా గణాంకాల ప్రకారం.. ఆగస్టు నెలలో మొత్తంగా నిరుద్యోగితా రేటులో వ్యవసాయం రంగంలో సంతృప్తికరంగా ఉన్నప్పటికీ.. ఫార్మల్ రంగంలో నిరుద్యోగిత రేటు మరింత పెరిగింది.
ఆగస్టు నెలలో పెరిగిన పట్టణ నిరుద్యోగితారేటు..
సీఎంఐఈ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆగస్టు నెలలో పట్టణ నిరుద్యోగిత రేటు గత నెలతో పోల్చుకుంటే మరింతగా పెరిగింది. జులైలో 9.15 శాతంగా ఉన్న నిరుద్యోగితా రేటు ఆగస్టులో 9.83 శాతానికిచేరుకుంది. దీని ప్రకారం పట్టణ ప్రాంతంలోని ప్రతీ పది మందిలో ఒకరికి ఉద్యోగం దొరకడం లేదు.
గ్రామీణ నిరుద్యోగితా పెరిగింది..
గ్రామీణ నిరుద్యోగితా కూడా బాగా పెరిగింది. జులైలో 6.66శాతంగా ఉన్న గ్రామీణ నిరుద్యోగిత.. ఆగస్టు నెలలో 7.65 శాతానికి ఎగబాకింది. 33.5 శాతం నిరుద్యోగితా రేటుతో హర్యానా అత్యంత గడ్డుపరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ తర్వాత త్రిపురలో 27.9శాతం నిరుద్యోగితా రేటు ఉంది.
జాతీయ స్థాయిలో పెరిగిన నిరుద్యోగం..
కరోనా ప్రభావం అంతగా లేని ఫిబ్రవరి, జనవరి, డిసెంబర్ నెలల కంటే ఈ ఆగస్టు నెలలో జాతీయ స్థాయిలో నిరుద్యోగితా రేటు బాగా పెరిగింది. 7.22 శాతం నుంచి 7.76 శాతానికి జాతీయ నిరుద్యోగితా రేటు పెరిగింది. మొత్తం మీద నిరుద్యోగం కూడా అధికంగా ఉంది. గత నెలలో 7.43 శాతం ఉండగా.. ఆగస్టులో అది 8.35 శాతానికి పెరిగింది
భారీగా పతనమైన జీడీపీ.. అన్ని రంగాలపై కరోనా కోలుకోలేని దెబ్బ..
ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన జీడీపీ పతనాన్ని భారత్ చూసిందని, వెంటనే ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.ఎన్నడూ లేని విదంగా 23.9 శాతం భారత జీడీపీ పతనమైన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం కారణంగా తయారీ రంగం వృద్ధి 39 శాతం పతనం కాగా, మైనింగ్ వృద్ధి 23శాతం, నిర్మాణ వృద్ధి 50 శాతం, ట్రేడ్ అండ్ హోటల్ ఇండస్ట్రీ 47 శాతం పతనమయ్యాయి. కరోనాను కట్టడి చేసేందుకు సుమారు నాలుగు నెలలపాటు కఠినంగా లాక్డౌన్ అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రభావంఅన్ని రంగాలపై పడింది.