ఇదీ భారత్ సత్తా, పోఖ్రాన్ లో స్వదేశీ శతఘ్ని పరీక్ష సూపర్ సక్సెస్.. ప్రపంచ రికార్డు!
భారత్ అణుపరీక్షా కేంద్రమైన పోఖ్రాన్ రేంజి మరోసారి ప్రపంచ వార్తల్లో నిలిచింది. ఈసారి కూడా ఒక ఆయుధమే ఇందుకు కారణం.. కానీ అణ్వాయుధం మాత్రం కాదు.. ఇదొక శతఘ్ని.
పోఖ్రాన్: భారత్ అణుపరీక్షా కేంద్రమైన పోఖ్రాన్ రేంజి మరోసారి ప్రపంచ వార్తల్లో నిలిచింది. ఈసారి కూడా ఒక ఆయుధమే ఇందుకు కారణం.. కానీ అణ్వాయుధం మాత్రం కాదు.. ఇదొక శతఘ్ని.
పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన అడ్వాన్స్డ్ టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్(ఏటీఏజీఎస్)ను బుధవారం పరీక్షించారు. ఈ సందర్భంగా ఆ వ్యవస్థ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 155 మిల్లీమీటర్ 52 క్యాలిబర్గన్ శతఘ్నిని పరీక్షించగా మూడు షెల్స్ 47.2 దూరంలోని లక్ష్యాలను తాకాయి.
దీనికోసం హైఎక్స్ప్లోజీవ్ బేస్ బ్లీడ్ (హెచ్ఈ-బీబీ ) శ్రేణి మందుగుండును వినియోగించారు. ప్రపంచవ్యాప్తంగా 155ఎంఎం 52 క్యాలిబర్ శతఘ్నుల్లో ఇటువంటివే వినియోగిస్తారు. కానీ అవి 40 నుంచి 45 కిలోమీటర్ల లక్ష్యాన్ని మాత్రమే తాకగలవు.
ఏటీఏజీఎస్ వ్యవస్థను రెండు వేర్వేరు చోట్ల డీఆర్డీవో సంస్థ అభివృద్ధి చేసింది. వీటిల్లో ఒకటి టాటా పవర్ భాగస్వామ్యంతో.. మరొకటి భారత్ ఫోర్జ్ భాగస్వామ్యంతో తయారు చేసింది. సోమవారం టాటా పవర్తో చేసిన నమూనా శతఘ్ని రికార్డు సృష్టించింది. శనివారం కూడా హైఎక్స్ప్లోజీవ్ బోట్ టెయిల్ వ్యవస్థను పరీక్షించారు. ఇది 37.2 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రికార్డు సృష్టించింది.
సాధారణంగా శతఘ్నులు ఎంత కచ్చితంగా లక్ష్యాలను ఛేదిస్తాయనే అంశంపైనే వాటి పనితీరు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం పరీక్షించిన శతఘ్నుల్లో 25 లీటర్ల ఛాంబర్ను వినియోగించారు. ఇదే కోవకు చెందిన ఫ్రెంచి నెక్సె్చర్, ఇజ్రాయిల్కు చెందిన ఎల్బిట్ శతఘ్నుల్లో 23లీటర్ ఛాంబర్లను మాత్రమే వాడారు.
శతఘ్నుల విషయంలో గన్ పొజిషన్ కూడా విజయాన్ని తీసుకొస్తుంది. భారత్ తయారు చేసిన శతఘ్నుల బరువు 18 టన్నుల వరకు ఉండగా.. ప్రపంచవాప్తంగా వినియోగించే శతఘ్నులు 15 టన్నుల వరకు ఉంటున్నాయి. వేసవి పరీక్షల్లో భాగంగా వీటిని నిర్వహించారు. ఇక శీతాకాల ఆయుధ పరీక్షలను డిసెంబర్లో సిక్కిం రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుత విజయంతో భారత సైన్యం ఒక్కో దానికి రూ.15 కోట్లు వెచ్చించి సుమారు 2,000 ఏటీఏజీఎస్ శతఘ్నులను కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. అంటే సుమారు రూ.30,000 కోట్ల డీల్ ఉత్పత్తి సంస్థలకు దక్కుతుందన్నమాట.