మస్ట్ రీడ్: భారత్ సురక్షితమైన దేశమే..కానీ వారికి మాత్రం కాదు: అమెరికా సర్వే
న్యూఢిల్లీ: ఇటీవలే అమెరికా నిర్వహించిన ఓ సర్వేలో భారత్కు కొన్ని అనుకూల అంశాలతో పాటు మరికొన్ని ప్రతికూల అంశాలు కూడా వెలుగు చూశాయి. 2020లో నివాసం ఉండేందుకు అత్యంత సురక్షితమైన దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉందని ఆ సర్వే ద్వారా స్పష్టమైంది. మనిషి జీవించేందుకు సురక్షితమైన ఆసియాదేశాల్లో భారత్ ఐదో స్థానంలో నిలిచింది. భారత్ కంటే ముందు చైనా, సింగపూర్, దక్షిణ కొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు ఉన్నాయి.
సురక్షిత దేశాల్లో భారత్ ర్యాంక్ 25
అమెరికా న్యూస్ మరియు వరల్డ్ రిపోర్ట్లు సంయుక్తంగా వార్టన్ స్కూల్ ఆఫ్ అమెరికాతో కలిసి చేసిన సర్వేలో భారత్ సురక్షితమైన దేశమని పేర్కొంది. గతేడాది అంటే 2019లో చేసిన సర్వేలో భారత్ 27వ స్థానంలో ఉండగా ఇప్పుడు ప్రపంచదేశాలతో పోలిస్తే రెండు స్థానాలను మెరుచుపర్చుకుని 25వ స్థానంలో ఉన్నట్లు ఆ సర్వే స్పష్టం చేసింది. అయితే చిన్నపిల్లల పెంపకం, మహిళల పరిస్థితి అనే విషయాల్లో మాత్రం భారత్పై సంతృప్తికరమైన అభిప్రాయం రాలేదని సర్వే చెప్పింది.
చిన్నపిల్లల పెంపకంలో భారత్ పరిస్థితి దారుణం
చిన్న పిల్లల పెంపకంలో భారత్ ప్రపంచదేశాలతో పోలిస్తే 59వ స్థానంలో నిలిచింది. ఎంతో క్రమ శిక్షణ గల దేశంగా పేరుగాంచిన సింగపూర్ 22వ స్థానంకు పరిమితమైనట్లు సర్వే చెప్పింది. ఇక అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న కెన్యా, ఈజిప్ట్ దేశాలు పిల్లల పెంపకంలో భారత్ కంటే మెరుగైన స్థానంలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే 2019లో చేసిన సర్వేలో పిల్లల పెంపకంలో భారత్ 65వ స్థానంలో ఉండగా అది కాస్త మెరుగుపడి 59వ స్థానంకు చేరుకుంది.
చిన్నారులపై రైల్వేస్ ఇచ్చిన రిపోర్టుతో ఆందోళన
భారతీయ రైల్వేస్ చిన్నారులపై ఇచ్చిన రిపోర్టు విడుదల కావడం దాని తర్వాత అమెరికా రిపోర్టు విడుదల కావడం చూస్తే భారత్లో చిన్నారుల పెంపకం సరిగ్గా లేదని భావించాల్సి ఉంటుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019లో దేశవ్యాప్తంగా ఆయా రైల్వే స్టేషన్ల నుంచి లేదా రైళ్లలో నుంచి 16,457 మంది చిన్నారులను సురక్షితంగా కాపాడగలిగామని రైల్వేస్ తన నివేదికలో వెల్లడించింది. అంటే రోజుకు 46 మందిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కాపాడిందని చెప్పొచ్చు.
మహిళల భద్రత విషయంలో కూడా భారత్ వెనుకంజ
ఇక మహిళల కోసం సురక్షితమైన దేశాలు ఏంటని సర్వే చేయగా భారత్ ర్యాంకు 58గా ఉంది. 2019తో ఇది 59గా ఉండేది. పశ్చిమాసియా దేశాలు అయిన యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా దేశాలు భారత్ కంటే ముందున్నాయి. పొరుగు దేశాలైన చైనా, శ్రీలంకలు కూడా మహిళల భద్రతా విషయంలో ముందున్నట్లు సర్వే స్పష్టం చేసింది. మర్డర్ రేట్లో చాలా ముందుండే దక్షిణాఫ్రికా మాత్రం మహిళలకు సురక్షితమైన దేశాల్లో భారత్ కంటే 15 ర్యాంకులతో ముందుండటం విశేషం.