నేను ఇంతే చెబుతాను.. టీ బాగుంది: అభినందన్ మరో వీడియో పోస్ట్ చేసిన పాకిస్తాన్
న్యూఢిల్లీ: భారత్ మిగ్ 21 బైసన్ విమానం పైలట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మీకి చిక్కాడు. అతనికి సంబంధించినవి అంటూ కొన్ని వీడియోలు వెలుగు చూస్తున్నాయి. అభినందన్ తమకు చిక్కాడని పాక్ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అతనిని పాకిస్తాన్ హింసించినట్లుగా తెలుస్తోంది.
కెమెరా ముందు ధైర్యంగా అభినందన్
అభినందన్ ముఖమంతా గాయాలతో ఉన్నప్పటికీ కెమెరా ముందు అతను మాట్లాడిన తీరు పట్ల భారతీయులు మరింత గర్విస్తున్నారు. ఎంతో నిబ్బరంగా, నిదానంగా తనను బంధించిన వారికి సమాధానం ఇచ్చారు. ఆ వీడియోలో దాని ప్రకారం.. తాను ఎవరు, తన సర్వీస్ నంబరు, అలాగే తన మతమేంటో వెల్లడించారు అభినందన్.
క్షమించండి.. ఇంతే చెబుతాను
ఆ తర్వాత ఓ గొంతు మరిన్ని వివరాలు కావాలని డిమాండ్ చేసింది. దానికి అభినందన్ మాత్రం.. క్షమించండి, ఇంతవరకు మాత్రమే చెప్పగలనని సూటిగా చెప్పేశారు. అలాగే అభినందన్.. తాను పాకిస్థాన్ ఆర్మీ వద్ద ఉన్నానా? అని మర్యాదగా అడిగారు. దానికి అటునుంచి సమాధానం రాలేదు.
మాటమార్చిన పాకిస్తాన్
తాము రెండు భారత విమానాలను కూల్చివేశామని, ఇద్దరు పైలట్లను అదుపులోకి తీసుకున్నామని బుధవారం పాకిస్థాన్ ఆర్మీ ప్రకటించింది. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ మాట మార్చింది. ఒక పైలట్ మాత్రమే తమ అదుపులో ఉన్నారని ఉదయం చేసిన ప్రకటనను పాకిస్తాన్ వెనక్కి తీసుకుంది.
మరో వీడియోలో టీ తాగుతూ
మరో వీడియోలో అభినందన్ టీ తాగుతూ విచారణ చేస్తున్న అధికారులకు సమాధానమిస్తున్నట్లుగా ఉంది. తొలుత పైలట్ను పాక్ స్థానికులు విపరీతంగా కొడుతున్నట్లు ఉన్న వీడియో బయటకు వచ్చింది. ఇందులో పైలట్ అక్కడి వాళ్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేందుకు నిరాకరించారు. కేవలం ఆయన ఐడీ నెంబరు, పేరును మాత్రమే బయటపెట్టినట్లు ఆ వీడియోలో ఉంది. ఇందులో పైలట్ ముఖమంతా రక్తం కారుతూ ఉన్నట్లుగా ఉంది. ఈ వీడియో పట్ల భారత్ విదేశాంగశాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జెనీవా ఒప్పందం ప్రకారం పొరుగుదేశానికి చిక్కిన వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించడం నిబంధనలను ఉల్లంఘించడమేనని భారత్ పేర్కొంది. ఈ వీడియో పట్ల తీవ్ర వ్యతిరేకత రావడంతో ట్విటర్ నుంచి దానిని తొలగించారు. కొద్ది గంటల తర్వాత పాక్ ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది. 1.19నిమిషాలు ఉన్న ఈ వీడియోలో పైలట్ టీ తాగుతూ కనిపించారు. ఆయన ముఖంపై గాయాలు ఉన్నాయి. కళ్లు బాగా ఉబ్బిపోయి కనిపించాయి. అక్కడి అధికారులు అడిగిన చాలా ప్రశ్నలకు పైలట్ సమాధానాలు చెప్పేందుకు నిరాకరించారు. టీ మీకు నచ్చిందా అని విచారణాధికారులు ప్రశ్నించగా, అద్భుతంగా ఉందని అభినందన్ సమాధానం ఇచ్చారు. అభినందన్ను తీసుకు రావాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతోంది.
త్రివిధ దళాలతో ప్రధాని భేటీ
భారత్ - పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం పరిస్థితిని సమీక్షిస్తోంది. ప్రధాని నరేంద్ మోడీ త్రివిద దళాధిపతులతో సమావేశమయ్యారు. లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో త్రివిధ దళాధిపతులు మోడీతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా, ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా హాజరయ్యారు. ఇదిలా ఉండగా, భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్తో యుద్ధం కోరుకోవడం లేదంటూ పాకిస్తాన్ సైనికాధికారి గఫూర్ చెప్పాడు. సమస్యలపై ఇరుదేశాలు కలిసి చర్చిందుకుందామన్నాడు. పాకిస్థాన్ బాధ్యతాయుత దేశమని, ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పడం తమ ఉద్దేశం కాదని చెప్పాడు. సామాన్య ప్రజలను బలిగొనడానికి పాకిస్తాన్ యత్నించదని వ్యాఖ్యానించాడు. ఆత్మరక్షణలో భాగంగానే పాకిస్తాన్ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ వెంట దాడులు చేశాయని, పాక్ ఎప్పుడూ శాంతినే ఆశిస్తుందని, యుద్ధం కోరుకోదన్నాడు. పాక్ సూచించినట్లుగా శాంతి దిశగా వెళ్లాలో లేదో భారత్ నిర్ణయించుకోవాలంటూ వ్యాఖ్యానించారు.