ఆంక్షలు ఉన్నప్పటికీ...రష్యా నుంచే ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేస్తాం: భారత్
న్యూఢిల్లీ: రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయరాదని అమెరికా భారత్పై ఆంక్షలు విధించినప్పటికీ.... ఆంక్షలకు భారత్ తలొగ్గదని స్పష్టం చేసింది. రక్షణ పరంగా రష్యాతో భారత్కు కొన్నేళ్లుగా మంచి సంబంధాలున్నాయని భారత్ వివరించింది. అమెరికా ఆంక్షలను ఎత్తివేయాలని భారత్ ఈ సందర్భంగా కోరింది. అమెరికా విదేశాంగా మంత్రి మైక్ పాంపే భారత్ పర్యటన సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్తో భేటీ కానున్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడం చర్చనీయాంశమైంది.
భారత్పై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ ఇప్పటికే ఆదేశంతో చర్చలు జరిపామని అయితే అగ్రరాజ్యం దీనిపై ఆలోచన చేస్తోందని భారత వర్గాలు తెలిపాయి. రష్యాతో భారత్ల మధ్య ఎప్పటినుంచో మంచి సంబంధాలు ఉన్నాయని భారత్ పేర్కొంది. రష్యాతో రక్షణ ఒప్పందాలు రద్దు చేసుకోమని చెప్పడం అమెరికాకు సబబుకాదని భారత్ అభిప్రాయపడింది. గతేడాది అక్టోబరులో రష్యాతో ఎస్-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ రూ.40వేల కోట్లు. అమెరికా హెచ్చరించినప్పటికీ భారత్ తగ్గలేదు. దేశ భద్రత దృష్ట్యా రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడానికే మొగ్గు చూపింది.
అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ తాము రష్యాతో మిసైల్ వ్యవస్థను కొనుగోలు చేసేందుకు ఎందుకు ఒప్పందం కుదుర్చుకున్నామో అగ్రరాజ్యానికి తెలుసు అని భారత వర్గాలు పేర్కొన్నాయి. ఎస్-400 క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు సంబంధించి తమ అవసరతను అమెరికాకు వివరించడంతో అమెరికా ఇందుకు సానుకూలంగా స్పందించిందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికా ఆంక్షల పరిధి నుంచి భారత్కు మినహాయింపు ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేసింది. అమెరికా ఆంక్షల చట్టంను నిశితంగా పరిశీలిస్తే ఎలాంటి సందర్భాల్లో ఆంక్షలు ఎత్తివేయొచ్చో స్పష్టంగా ఉందని... ఆ నిబంధన మేరకే భారత్పై ఆంక్షలు ఎత్తివేయాలని ట్రంప్ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చింది.
ఇదిలా ఉంటే రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థ వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి భారత్కు చేరుకుంటాయని.. మొత్తం 2023 ఏప్రిల్ నాటికి చేరుకుంటాయని భారత్ స్పష్టం చేసింది. రష్యాపై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్ డబ్బులు చెల్లించే విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంది.