ఐఎన్ఎస్ జలాశ్వ..విశాఖతో లింకు: గల్ఫ్లో చిక్కుకున్న వారి కోసం ఈ మూడు యుద్ధనౌకలను పంపడం వెనుక..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తోన్న లాక్డౌన్ పరిస్థితుల వల్ల గల్ఫ్ దేశాలు, మాల్దీవుల్లో లక్షలాది మంది భారతీయ కార్మికులు చిక్కుకున్నారు. లాక్డౌన్ వల్ల నిర్మాణ, మౌలిక రంగాలు స్తంభించిపోవడం వల్ల వాటిపై ఆధారపడిన కార్మికులు ఉపాధిని కోల్పోయారు. లాక్డౌన్ను ఎప్పుడు ఎత్తేస్తారో తెలియని పరిస్థితి. పూట గడవని స్థితిని ఎన్నాళ్లు అనుభవించాలో తెలియని దుర్భరంలో ఉన్నారు. వారిని స్వదేశానికి తీసుకుని రావాలంటూ పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రానికి విజ్ఙప్తి చేశాయి. వారిని సురక్షితంగా తీసుకుని రావడానికి ప్రత్యేక విమానాలు, యుద్ధనౌకలను సిద్ధం చేసింది కేంద్రం.
తెలంగాణలో కరోనా పీచమణచడానికి వుహాన్ స్ట్రాటజీ:సుదీర్ఘ లాక్డౌన్ ఒక్కటే బ్రహ్మాస్త్రం:తొలి రాష్ట్రంగా
మూడు యుద్ధ నౌకలు..
భారతీయ కార్మికులను స్వదేశానికి తీసుకుని రావడానికి కేంద్ర ప్రభుత్వం విమానాలనే కాదు.. సముద్ర మార్గాన్ని కూడా వినియోగించుకుంటోంది. ఇందులో భాగంగా మూడు యుద్ధనౌకలను రంగంలోకి దింపింది. మాల్దీవులతో పాటు దుబాయ్ వంటి గల్ఫ్ దేశాల వైపు బయలుదేరి వెళ్లాయి ఆ యుద్ధనౌకలు. నౌకాదళం తురుపుముక్కలుగా గుర్తింపు పొందిన ప్రధానఐఎన్ఎస్ జలాశ్వ, ఐఎన్ఎస్ శార్దూల్, ఐఎన్ఎస్ మగర్ల సేవలను వినియోగించుకుంటోంది. వాటినే ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ఐఎన్ఎస్ జలాశ్వ.. విశాఖ నావల్ కమాండ్ పర్యవేక్షణలో..
ఐఎన్ఎస్ జలాశ్వ యుద్ధ విమానాల నిర్వహణ, పర్యవేక్షణ అంతా ప్రస్తుతం విశాఖపట్నంతో ముడిపడి ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న తూర్పు నౌకాదళం ఆధీనంలో ఉంటోంది ఈ యుద్ధనౌక. 2007లో తొలిసారిగా నౌకాదళంలోకి చేరింది. 90 మిలియన్ డాలర్లను ఖర్చు చేసి అమెరికా నుంచి కొనుగోలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం నౌకాదళంలో ఉన్న అమెరికా తయారు చేసిన యుద్ధ నౌకలు ఇవే. ఐఎన్ఎస్ జలాశ్వ యుద్ధనౌకలకు విశాఖపట్నాన్ని హోమ్ పోర్ట్గా భావిస్తుంటారు.
ఒకేసారి ఆరు హెలికాప్టర్లు టేకాఫ్..
ఒకేసారి ఆరు హెలికాప్టర్లు దీని మీది నుంచి టేకాఫ్ తీసుకోవడానికి వీలుంది. వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ దీని ప్రత్యేకత. 1000 ట్రూపులను ఒకేసారి మోయగల సామర్థ్యం దీని సొంతం. ఓ ఆపరేషన్ థియేటర్, 12 పడకల వార్డు, ఓ ల్యాబొరేటరీ, డెంటల్ క్లినిక్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. గంటకు 20 నాట్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. 1000 ట్రూపులను తీసుకుని రాగల సామర్థ్యం ఉండటం వల్ల గల్ఫ్ దేశాల్లో చిక్కుకునిపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకుని రావడానికి ఈ యుద్ధనౌకను వినియోగిస్తోంది కేంద్రం.
ఐఎన్ఎస్ మగర్..
ఐఎన్ఎస్ మగర్.. స్వదేశంలో తయారైన యుద్ధనౌక ఇది. కోల్కతలోని గార్డెన్ రీసెర్చ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ దీన్ని తయారు చేసింది. 1987 జులై 18వ తేదీన దీన్ని తొలిసారిగా నౌకాదళంలోకి తీసుకొచ్చారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయ, పునరావాస చర్యలు అనగానే గుర్తుకు వచ్చే ఏకైక యుద్ధనౌక ఇది. 2004లో సంభవించిన సునామీ సమయంలో సహాయ, పునరావస చర్యల్లో ఐఎన్ఎస్ మగర్ సేవలను విస్తృతంగా వినియోగించుకున్నారు. శ్రీలంకలో నిర్వహించిన ఆపరేషన్ పవన్.. సమయంలోనూ ఈ నౌక సేవలను తీసుకున్నారు. శ్రీలంకకు భారత శాంతిదళాలను ఈ నౌక ద్వారా తరలించారు.
ఐఎన్ఎస్ శార్దూల్..
ఈ రెండింటి తరహాలోనే ఐఎన్ఎస్ శార్దూల్కు కూడా ప్రత్యేకతలు ఉన్నాయి. 125 మీటర్ల పొడవు ఉన్న ఐఎన్ఎస్ శార్దూల్ యుద్ధనౌకను అంతర్జాతీయ స్థాయిలో సహాయ, పునరావాసర చర్యల కోసం వినియోగిస్తుంటారు. ఇదివరకు మడగాస్కర్లోె సంభవించిన ప్రకృతి వైపరీత్యాల సమయంలో అక్కడి ప్రభుత్వ విజ్ఙప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ యుద్ధనౌకను సహాయ కార్యక్రమాల కోసం పంపించింది. 600 టన్నుల బియ్యం, ఇతర ఆహార వస్తువులను భారత్ నుంచి సేకరించి మడగాస్కర్కు చేరవేసింది.