మరో 3 వారాల్లో 50ఏళ్లపైబడిన వారికి వ్యాక్సిన్, 2 నెలల్లో మరో 18-20 కొత్త వ్యాక్సిన్లు: హర్షవర్ధన్
న్యూఢిల్లీ: వచ్చే రెండు, మూడు నెలల్లో ఇప్పుడున్న రెండు కరోనా వ్యాక్సిన్లతోపాటు మరికొన్ని కూడా వినియోగంలోకి రానున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ కారణంగా ఏ ఒక్కరు కూడా మరణించలేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. నిర్లక్షం కారణంగానే కొందరు ఆస్పత్రులపాలయ్యారన్నారు.
వచ్చే 2-3 వారాల్లో 50ఏళ్ల పైబడినవారికీ వ్యాక్సిన్
సోమవారం కేంద్రమంత్రి హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ.. బడ్జెట్లో ఆరోగ్య రంగానికి ముఖ్యంగా వ్యాక్సినేషన్ కోసం రూ. 35వేల కోట్లను కేటాయించడం హర్షనీయమన్నారు. రాబోయే రెండు, మూడు వారాల్లో 50 ఏళ్ల పైబడినవారికి కరోనా వ్యాక్సిన్ అందించే ప్రక్రియ దేశ వ్యాప్తంగా ప్రారంభం కానుందని హర్షవర్ధన్ తెలిపారు.
రాబోయే రోజుల్లో కొత్తగా 18-20 వ్యాక్సిన్లు
ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉండగా, మరో 18-20 వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని కేంద్రమంత్రి చెప్పారు. కరోనాకు సంబంధించి 18 నుంచి 20 వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్, అడ్వాన్స్డ్ దశలో ఉన్నాయని తెలిపారు. సుమారు 20-25 దేశాలకు మనం వ్యాక్సిన్ సరఫరా చేయనున్నామని కేంద్రమంత్రి వెల్లడించారు.
వ్యాక్సిన్లపై అపోహలు వద్దు..
వ్యాక్సిన్కు సంబంధించి అపోహలు వీడాలని ప్రజలకు హర్షవర్ధన్ సూచించారు. అద సమయంలో కరోనా నిబంధనలను కూడా పాటించాలన్నారు. గడిచిన వారం రోజులుగా దేశ వ్యాప్తంగా 188 జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. 21 జిల్లాల్లో గత 21 రోజులుగా ఒక్క కరోనా కేసూ లేదని వెల్లడించారు.
ప్రస్తుతం దేశంలో రెండు వ్యాక్సిన్ల వినియోగం..
కాగా, ప్రస్తుతం మనదేశంలో భారత్ బయెటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. జనవరి 16 నుంచి దేశ వ్యాప్తంగా ఆరోగ్య సిబ్బంది, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్కు వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు 82,85,295 కరోనా వ్యాక్సిన్ అందించారు. గత 24 గంటల్లో 4,86,122 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 11,649 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజు వ్యవధిలో 90 మంది కరోనాతో మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 1,55,732కు చేరింది. దేశంలో ప్రస్తుతం 1,39,637 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 1.06 కోట్ల మంది కోలుకున్నారు.