వారణాసిలో మోడీ సంకేతాలు: ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతోన్న బీజేపీ
భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తన సొంత నియోజకవర్గం వారణాసి నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంను మోడీ ప్రారంభించారు. ఐదు ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అంటే ఏమిటో ముందుగా అర్థం చేసుకుని ఆ తర్వాత ప్రజలకు వివరించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ప్రతి గృహం యొక్క ఆదాయం పెరగాలని మోడీ అన్నారు. భారత్ కలలు కనకూడదా అని ఆయన ప్రశ్నించారు. పేదరికం అనేది మన తలరాత కాకూడదని మోడీ చెప్పారు.
మోడీ చేసిన ప్రసంగం వింటే వచ్చే ఏడాది పలు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నట్లు కనిపిస్తోంది. వచ్చే ఏడాది హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, పుదుచ్చేరి, కీలకమైన బీహార్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పదిరోజుల క్రితం లోక్సభ సమావేశాల్లో మాట్లాడారు. భారత్ కొత్త పుంతలు తొక్కేందుకు సిద్ధమవుతోంది. కొత్త కోరికలతో ముందుకు వెళుతోందని అన్నారు. పాత భారత్లో అవినీతి రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు ఉండేవని చెప్పిన ప్రధాని నవభారత్లో ప్రజలు కొత్త కోరికలతో ముందుకు వెళుతున్నారని అన్నారు. ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ నిర్మించడం మాటలు కాదని చాలామంది హేళన చేస్తున్నారని మోడీ గుర్తు చేశారు. అయితే కలలు కనడంలో తప్పులేదని చెప్పిన ప్రధాని... ఆ కలలు సాకారం చేసుకునే దిశగా అడుగులు వేయకపోవడం తప్పు అవుతుందని చెప్పారు.
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని చేరుకోవడంలో కష్టాలు ఎదురవుతాయని చెప్పిన ప్రధాని మోడీ... వాటిని అధిగమించే సత్తా నేటి భారత్కు ఉందనే విశ్వాసం వ్యక్తం చేశారు. కష్టాలను అధిగమించడంలో భారత ప్రజలు ఎప్పుడూ ముందుంటారన్న సంగతి హేళన చేసేవారు మరిచారని అన్నారు.దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు యువత పడుతున్న కష్టంను ప్రశంసించారు మోడీ. ఎదురయ్యే కష్టాలే మన సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తాయని మోడీ చెప్పారు. తన నాయకత్వంలో భారత్ 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని... ఇలా ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ఎవరు ఊహించారని ప్రశ్నించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రతి ఒక్కరి కష్టం ఉందని కొనియాడారు మోడీ.