‘కానుకే’: ఇక కోహినూర్ వజ్రం మనది కాదు!
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ప్రఖ్యాత వజ్రమైన కోహినూర్ ఇక ఎప్పటికీ భారత్కు దక్కకపోవచ్చు. మన చారిత్రక సంపద అయిన ఈ వజ్రాన్ని తిరిగి భారత్కు తీసుకొచ్చే విషయమై సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇదే సంకేతాలను ఇచ్చింది.
'కోహినూర్ వజ్రాన్ని బ్రిటిష్ వాళ్లు దొంగిలించలేదు. బలవంతంగా తీసుకెళ్లలేదు. దాన్ని వారికి బహుమతిగా ఇచ్చారు. కాబట్టి వెనక్కి అడిగే ఆలోచన ఏమీ లేదు' అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దానిని పంజాబ్కు చెందిన మహారాజా రంజిత్సింగ్ ఈస్ట్ఇండియా కంపెనీకి కానుకగా ఇచ్చారని తెలిపింది.
కాబట్టి కోహినూర్ వజ్రాన్ని వెనక్కి ఇవ్వమని అడిగే ప్రసక్తే లేదని ప్రభుత్వం పేర్కొంది. వజ్రాన్ని బ్రిటన్ వద్దే ఉంచుకోనివ్వమని తెలిపింది. భారత్కు చెందిన కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారణకు తీసుకున్న సుప్రీంకోర్టు ఇటీవల ఈ అంశంపై కేంద్రం వైఖరిని తెలియజేయాలని ఆదేశించింది. దీనిపై కేంద్రం ఈ విధంగా స్పందించింది.
కాగా, స్వాతంత్య్రానికి పూర్వం దేశం ఆవలకు తరలిపోయిన ప్రాచీన సంపదను ప్రభుత్వం తీసుకురాకూడదంటూ 43 ఏళ్ల కిందట తీసుకొచ్చిన చట్టాన్ని ఉటంకిస్తూ కేంద్రం తరఫున సోలిసిటర్ జనరల్ రంజిత్కుమార్ గురువారం వాదనలు వినిపించారు.
1849నాటి సిక్కు యుద్ధంలో ఓడిపోయిన నేపథ్యంలో మహారాజా రంజిత్ సింగ్ 105.602 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని ఈస్టిండియా కంపెనీకి అందజేశారని ఆయన సుప్రీంకోర్టుకు నివేదించారు.
ఆంటిక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజరీ చట్టం 1972 ప్రకారం దేశం నుంచి అక్రమంగా తరలిపోయిన ప్రాచీన సంపదను మాత్రమే ఆర్కియాలిజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) తిరిగి తీసుకొచ్చే అవకాశముంటుందని తెలిపారు.
సోమవారం విచారణలో కేంద్రం తమ వైఖరిని స్పష్టంచేసింది. అయితే ఈ కేసులో మరో పార్టీగా ఉన్న విదేశాంగ శాఖ కూడా తమ వైఖరిని వెల్లడించాల్సి ఉంది. ఆరు వారాల్లోగా తమ స్పందనను సమగ్రంగా తెలియజేయాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. సాంస్కృతిక శాఖ, పాకిస్థాన్, బంగ్లాదేశ్, బ్రిటన్ల హైకమిషనర్లను కూడా ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పార్టీలుగా పేర్కొన్నారు.
కాగా, 105 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని 1850లో బ్రిటన్ రాణికి అందజేశారు. ఆ వజ్రం ప్రస్తుతం రాణి కిరీటంలో ఉంది. గతంలో కోహినూర్ వెనక్కి ఇచ్చే అంశాన్ని బ్రిటన్ కూడా వ్యతిరేకించింది. రాణి కిరీటంలో ఉన్న వజ్రాన్ని వెనక్కి ఇవ్వలేమని వెల్లడించింది.