జాదవ్ వీడియో: పాక్కు ఘాటుగా భారత్ జవాబు
న్యూఢిల్లీ: కుల భూషణ్ యాదవ్ మాట్లాడంటూ పాకిస్తాన్ విడుదల చేసిన వీడియోపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. అది ఒక ప్రచార క్రీడ మాత్రమేనని, దానికి విశ్వసనీయత లేదని భారత్ వ్యాఖ్యానించింది.
అది ఆశ్చర్యకమైన విషయమేమీ కాదని, వీడియోలో బలవంతంగా చెప్పే పనిని అది కొనసాగిస్తోందని, ప్రచారం కోసం చేసే క్రీడలకు విశ్వసనీయత ఉండదనేది పాకిస్తాన్ గుర్తించాల్సిన సమయం వచ్చిందని అన్నది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
నిర్బంధంలో ఉన్న ఖైదీ తను బాగా ఉన్నానని చెప్తాడని అనడంలో అర్థం లేదని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ అంతర్జాతీయ నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉందని భారత్ అభిప్రాయపడింది.
తన తల్లిని, తన భార్యను పాకిస్తాన్ చాలా బాగా చూసుకుందని కులభూషన్ జాదవ్ అన్నట్లు ఉన్న ఓ వీడియోను పాకిస్తాన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత దౌత్యాధికారిపై ఆయన నిందలు వేసినట్లు కూడా ఆ వీడియోలో ఉంది.