చైనాకు భారత్ 'ఎక్స్ట్రా' షాక్, డ్రాగన్ కంపెనీల ఆస్తులు అమెరికా సీజ్
విదేశాల నుంచి చౌక దిగుమతులకు చెక్ చెప్పేందుకు ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి అయ్యే కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులపై అదనపు దిగుమతి పన్ను విధించింది.
న్యూఢిల్లీ: విదేశాల నుంచి చౌక దిగుమతులకు చెక్ చెప్పేందుకు ప్రభుత్వం చైనా నుంచి దిగుమతి అయ్యే కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులపై అదనపు దిగుమతి పన్ను విధించింది.
చదవండి: డొక్లామ్, బ్రిక్స్ ఎఫెక్ట్: భారత్ ముందు పనిచేయని చైనా వ్యూహం
18.95 శాతం అదనపు పన్ను, దేశీయ తయారీకి ఉపశమనం
దిగుమతుల నుంచి దేశీయ స్టీల్ తయారీదారులకు ఉపశమనం కలిగించేలా కొన్ని హాట్ రోల్డ్,కోల్డ్ రోల్డ్ స్టెయిన్ లెస్ స్టీల్ దిగుమతులపై 18.95 శాతం అదనపు పన్ను విధించినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
అందుకే అదనంగా
చైనా నుంచి వెల్లువెత్తుతున్న ఈ దిగుమతులతో దేశంలో స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ సంక్షోభం ఎదుర్కొంటోందని, దీనిని నివారించేందుకు దిగుమతులపై అదనపు సుంకం విధించినట్టు తెలిపాయి. చైనా, జపాన్, దక్షిణ కొరియాల నుంచి స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్ దిగుమతులపై భారత్ ఇప్పటికే యాంటీ డంపింగ్ సుంకాలను విధించింది.
మాట మార్చిన చైనా
బ్రిక్స్ దేశాల సదస్సులో తొలిసారిగా పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థల పేర్లను ప్రస్తావిస్తూ తీర్మానం తీసుకొచ్చారు. ఈ తీర్మానంపై చైనా సంతకం చేసింది. పాకిస్థాన్కు చైనా మద్దతిస్తున్న నేపథ్యంలో ఈ తీర్మానంతో ఇరు దేశాల మధ్య బంధానికి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని భావించారు. అయితే పాక్తో తమ స్నేహం ఎప్పటిలాగే ఉంటుందని చైనా స్పష్టం చేసింది. పాక్కు సంబంధించిన వరకు చైనా విధానాల్లో ఎలాంటి మార్పు ఉండదని, ఉగ్రవాదంపై పోరాడటంలో పాక్ చేసిన త్యాగం చాలా గొప్పదని, దీనిని ప్రపంచ దేశాలు గుర్తించాలని చెప్పింది.
చైనాకు అమెరికా షాక్
మరోవైపు, చైనా కంపెనీలు మనీ లాండరింగ్కు పాల్పడుతూ ఉత్తర కొరియాకు లాభం చేకూర్చుతున్నాయని అమెరికా ఆరోపించింది. అలాంటి కంపెనీల కార్యకలాపాలను అమెరికాలో నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు, ఆ కంపెనీల ఆస్తులను కూడా సీజ్ చేసింది.
ఈ కంపెనీ ఆస్తులు సీజ్
సమాచారం మేరకు చైనాకు చెందిన జెడ్టీఈ కార్పోరేషన్ అనే సంస్థ ఉత్తర కొరియాకు అక్రమంగా డబ్బు చేరవేస్తుందని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ సంస్థపై అమెరికా ఉక్కుపాదం మోపింది. కంపెనీ ఆస్తుల్లో మూడోవంతు సీజ్ చేసింది. ఈ కంపెనీతో పాటు మరికొన్ని కంపెనీలు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయని గుర్తించారు. త్వరలో వాటిపై చర్యలు తీసుకునే అవకాశముంది.