దేశం యావత్తు ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా ఉంది: ప్రముఖుల ట్వీట్
కోట్లాదిమంది భారతీయుల ఆశలు, కలలను తన వెంట మోసుకెళ్లిన చంద్రయాన్ - 2.. చిట్ట చివరి నిమషంలో గతి తప్పింది. విఫలమైంది. ఊరించి.. ఉసూరుమనిపించింది. చంద్రుడి ఉపరితలానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఉన్న సమయంలో దారి తప్పింది. ఇక విక్రమ్ ల్యాండర్ గతి తప్పడంతో ఒక్కసారిగా నిరుత్సాహానికి గురయ్యారు శాస్త్రవేత్తలు. వెంటనే ప్రధాని మోడీ వారిని పలకరిస్తూ అధైర్యపడొద్దంటూ ధైర్యం చెప్పారు. అంతేకాదు ఇలాంటి తప్పిదాలు జరగడం సహజమే అని మళ్లీ ప్రయత్నిద్దామంటూ పిలుపునిచ్చారు.
దేశం గర్వపడేలా ఇస్రో చేసింది: అమిత్ షా
చంద్రయాన్ విఫలం అయ్యాక నిరుత్సాహానికి గురైన సైంటిస్టులకు దేశం మొత్తం అండగా నిలిచింది. పలువురు ప్రముఖులు కూడా శాస్త్రవేత్తలు చేసిన కృషిని కొనియాడుతూ వారికి ధైర్యం చెబుతూ ట్వీట్లు చేశారు. చంద్రయాన్-2 విజయవంతం కోసం చివరినిమిషం వరకు ప్రయత్నించిన ఇస్రో దేశం గర్వపడేలా చేసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ సమయంలో శాస్త్రవేత్తలకు దేశం అండగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో నిర్వహించబోయే ప్రాజెక్టులకు ఆల్ది బెస్ట్ చెప్పారు అమిత్ షా.
శాస్త్రవేత్తల అంకిత భావం అందరికీ స్ఫూర్తి
చంద్రయాన్-2 మిషన్ మీద అహోరాత్రులు శ్రమించిన ఇస్రో శాస్త్రవేత్తలను అభినందిస్తూ ట్వీట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాందీ. వారు చూపిన ఉత్సాహం, ప్రాజెక్టు పట్ల అంకిత భావం ప్రతి భారతీయుడికి స్ఫూర్తినిస్తుందని చెప్పారు. శాస్త్రవేత్తల ప్రయత్నం వృథా కాలేదని చెప్పిన రాహుల్ గాంధీ... భవిష్యత్తులో మరింత పట్టుదలతో పనిచేసేందుకు ఈ ప్రయోగం బాటలు వేసిందని ట్వీట్ చేశారు.
లోపంను గుర్తించి మళ్లీ ప్రయత్నిద్దాం
చివరి దశలో తలెత్తిన లోపంను తప్పకుండా సరిదిద్ది మళ్లీ ఇస్రో సక్సెస్ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్. శాస్త్రవేత్తలు నిజంగా విజయం సాధించారని చెప్పారు. కచ్చితంగా లోపాన్ని గుర్తించి మళ్లీ విజయం సాధించే దిశగా ప్రయత్నం చేస్తామని చెబుతూ ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. భారత దేశం ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తోందని ట్వీట్ చేశారు.