కరోనా టెస్టులలో భారత్ మరో ముందడుగు ..గంటకు 32 టెస్టులు చేసే ఆటోమేటేడ్ మిషనరీ సిద్ధం
భారతదేశంలో పెరుగుతున్న కరోనా కేసులతో పాటుగా, టెస్టులు సామర్థ్యం పెరగడం లేదని ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో గంటకు 32కరోనా టెస్టులను నిర్వహించే ఒక టెస్టింగ్ యంత్రాన్ని ప్రారంభించింది మై ల్యాబ్స్ సొల్యూషన్స్ మరియు పుణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఆఫ్ ఇండియా.
కరోనా టెస్టుల కోసం కిట్ల తయారీ
ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ ను తరిమి కొట్టడం ఇప్పట్లో సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా నియంత్రణ ఎంతో అవసరమని భావిస్తున్నపలు కంపెనీలు టెస్టులకు కావలసిన కిట్లను రూపొందిస్తుండగా, మరికొన్ని కంపెనీలు కరోనా ఉపశమన మందుల తయారీలో బిజీగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా కరోనా నివారణ కోసం, కరోనాను అంతమొందించడానికి కూడా వ్యాక్సిన్ తయారు చేయడానికి పలు కంపెనీలు ముందుకు రాగా క్లినికల్ ట్రయల్స్ కూడా మొదలు పెట్టారు.
ముందడుగు వేసిన ఇండియా .. ఆటోమేటేడ్ కరోనా టెస్టింగ్ మిషన్ రెడీ
ఇదే సమయంలో తాజాగా భారత కంపెనీలు మరో అడుగు ముందుకు వేశాడు కరోనా టెస్ట్ లకు సంబంధించిన కీలక యంత్రాన్ని ఆవిష్కరించాయి. మై ల్యాబ్స్ సొల్యూషన్స్ మరియు పుణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నేడు ఆటోమేటిక్ గా పనిచేసే కరోనా టెస్టింగ్ కిట్ ను ప్రారంభించింది. ఆటోమేటిక్ మాలిక్యులర్ కోవిడ్ టెస్ట్ మిషన్ వల్ల భారతదేశంలో పరీక్షల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని వారు పేర్కొన్నారు. ఇది మానవ చర్యలు తగ్గించి, తనంతట తనే పనిచేసే, నమూనాలను సేకరించే స్వయంచాలక యంత్రమని పేర్కొన్నారు.
గంటకు 32 కరోనా పరీక్షలు చెయ్యగల సామర్ధ్యం
దీని ద్వారా గంటకు 32 కరోనా పరీక్షలు చేయవచ్చని తెలుస్తుంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న ఈ క్రమంలో ఈ యంత్రం పరీక్షలు నిర్వహించడానికి చాలా ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. ఈ ఆటోమేటెడ్ కోవిడ్ టెస్ట్ మెషిన్ అయిన టెస్ట్ కిట్ ను ప్రారంభించిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనవల్లా మాట్లాడుతూ టెస్ట్ కిట్ను సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అభివృద్ధి చేశాయని చెప్పారు. ఇది గంటకు 32 పరీక్షలు చేయగలదని చెప్పారు. ప్రస్తుత భారతదేశ అవసరాలు తీరుస్తుంది అని వెల్లడించారు.
కోవిడ్ -19 తో పాటు, ఇతర రోగాలకు పరీక్షలు చేసే యంత్రం
కోవిడ్ -19 తో పాటు, ఈ యంత్రం ఇతర రోగాలకు కూడా పరీక్షలు చేయగలదని ఆయన అన్నారు. ఈ యంత్రాన్ని ఉపయోగించి నిర్వహించే ప్రతి పరీక్షకు ప్రైవేట్ ల్యాబ్లు 1,000 రూపాయలు చెల్లిస్తాయని, ప్రజలకు పరీక్షకు రూ .2,500 ఉంటుందని అదర్ పూనవల్లా తెలిపారు. ప్రస్తుతం ఈ టెస్టింగ్ మెషీన్లో రెండు వేరియంట్లు ఉన్నాయని మైలాబ్స్ సొల్యూషన్స్ డైరెక్టర్ హస్ముఖ్ రావల్ తెలిపారు. పెద్ద యంత్రానికి రూ .40 లక్షలు ఖర్చవుతుంది మరియు చిన్నది గంటకు ఎనిమిది నమూనాలను పరీక్షించే సామర్థ్యం కలిగి ఉంటుంది అని తెలిపారు.
కరోనాకేసులు పెరుగుతున్న సమయంలో టెస్ట్ లలో ఇండియా ముందడుగు
కోవిడ్ -19 పరీక్షను మాన్యువల్ ప్రాసెస్ నుండి ఆటోమేటెడ్ చేయడానికి ఐసిఎంఆర్ అనుమతి తీసుకోవలసిన అవసరం లేదని అన్నారు . ఎందుకంటే పరీక్ష మాన్యువల్ గా ఎలా ఉంటుందో అదే విధంగా ఆటోమేటేడ్ లోనూ ఉందని పేర్కొన్నారు . మాన్యువల్ టెస్టింగ్ ఇప్పుడు ఆటోమేటెడ్ టెస్టింగ్ అయ్యిందని ఇది మానవ సంబంధాన్ని బాగా తగ్గిస్తుందని ఎలాంటి ఇబ్బంది లేకుండా పని చేసుకుపోతుందని పేర్కొన్నారు. మొత్తానికి కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో వైద్య సిబ్బంది అవసరం లేకుండా ఆటోమేటేడ్ గా పరీక్షలు నిర్వహించే టెస్టింగ్ మిషన్ అందుబాటులోకి రావటం భారత్ లో నిజంగా ఒక ముందడుగే .