మీ తీరు అభ్యంతరకరం: అభినందన్పై పాక్ తీరుమీద భారత్ ఆగ్రహం, భారత్కూ పాక్ సమన్లు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆధీనంలో భారత పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ పైన పాకిస్తాన్ తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎల్వోసీలో పట్టుబడిన తమ కమాండర్ను వెంటనే తమకు అప్పగించాలని డిమాండ్ చేసింది. భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్లోని పాకిస్తాన్ డిప్యూటీ హై కమిషనర్కు సమన్లు కూడా జారీ చేసింది. తద్వారా నిరసన తెలిపింది.
పాకిస్థాన్కు చెందిన యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి భారత గగనతలంలోకి ప్రవేశించడం, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని భారత వైమానిక దళ పైలట్ గాయాలతో కనపడడం వంటి చర్యలపై పాకిస్తాన్ డిప్యూటీ హైకమిషనర్ సయ్యద్ హైదర్షాకు భారత విదేశాంగ శాఖ బుధవారం సమన్లు జారీ చేసింది.
ఈ రెండు అంశాలపై పాకిస్థాన్ అంతర్జాతీయ నిబంధనలు, జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, ఈ చర్యలపై తీవ్రమైన అభ్యంతరం తెలుపుతున్నామని భారత్ పేర్కొంది. ఈ చర్యలపై నిరసన తెలిపింది. పాక్లో ఉన్న భారత పైలట్ వింగ్ కమాండర్ అభినందన్ను వెంటనే, సురక్షితంగా తిప్పి పంపాలని డిమాండ్ చేసింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు చెబుతుంటే, పాక్ దాన్ని పక్కనపెట్టేసి ఇలాంటి చర్యలకు పాల్పడటాన్ని ప్రశ్నించింది.
పాక్ హైకమిషనర్కు ఈ రోజు మధ్యాహ్నం సమన్లు జారీ చేశామని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఈ రోజు భారత భూభూగంలోకి వచ్చి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ నిబంధనలు ఉల్లంఘించిందని, ఇండియన్ మిలిటరీ పోస్టులను టార్గెట్ చేసిందని పేర్కొంది.
ఉగ్రవాద నిర్మూలనలో ద్వైపాక్షిక నిబంధనలు ఉల్లంఘించినందుకు నిరసన వ్యక్తం చేస్తున్నట్లు భారత్ తెలిపింది. అంతర్జాతీయ నియమ నిబంధనలకు లోబడి ఉగ్రవాదంపై చర్య తీసుకోవాల్సింది పోయి, భారత్కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని పేర్కొంది.
మంగళవారం వేకువజామున పాకిస్తాన్లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేయడాన్ని భారత్ సమర్థించుకుంది. తమ దేశ భద్రత, సార్వభౌమాధికారం కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉందని, ఉగ్రవాదం పేరుతో బార్డర్ దాటి తమపై చేస్తున్న చర్యలకు అది ప్రతిచర్య అని అభిప్రాయపడింది.
బుధవారం ఉదయం పాకిస్తాన్కు పట్టుబడిన అభినందన్ను వెంటనే తమకు అప్పగించాలని భారత్ డిమాండ్ చేసింది. అతనిపై పాకిస్తాన్ తీరును తీవ్రంగా ఖండించింది. అతనిపై పాకిస్తాన్ తీవ్రంగా దాడి చేసినట్లు, వేధించినట్లు వార్తలు, వీడియోలు వచ్చాయి. దీనిపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జెనీవా ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని తెలిపింది. పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న తమ కమాండర్కు ఎలాంటి హానీ జరగదని పాకిస్తాన్ హామీ ఇవ్వాలని, భారత్ కూడా ఆయన వెంటనే సురక్షితంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తోందని పేర్కొంది.
ఇదిలా ఉండగా, భారత్ హైకమిషనర్ గౌరవ్ అహ్లువాలియాకు పాకిస్థాన్ సమన్లు జారీ చేసింది. భారత్ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడుతోందని పేర్కొంది. కాల్పుల విరమణపై 2003లో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించాలని చెప్పింది. నియంత్రణ రేఖ వద్ద భారత భద్రతా బలగాలు శాంతియుత వాతావరణం కోసం కృషి చేయాలని చెప్పింది.