అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అగ్ని-4 పరీక్ష విజయవంతం, 4వేల కి.మీ. టార్గెట్ను ఛేదిస్తుంది
భువనేశ్వర్: అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అగ్ని-4 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఈ క్షిపణిని పరీక్షించినట్లు రక్షణ శాఖ అధికారులు మంగళవారం తెలిపారు. 17 టన్నుల బరువు, 20 కిలో మీటర్ల పొడవు ఉన్న ఈ క్షిపణి నాలుగు వేల కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఒక టన్ను న్యూక్లియర్ వార్ హెడ్ను ఇది మోసుకు వెళ్లగలదు.
ఈ అగ్ని క్షిపణి-4ను ఒరిస్సా తీరం నుండి ఉదయం పది గంటల పందొమ్మిది నిమిషాలకు పరీక్షించారు. అనుకున్న సమయానికి దీనిని ప్రయోగ పరీక్ష చేశామని, ఈ ఏడాదిలో ఇది రెండో మిసైల్ పరీక్ష అని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తెలిపింది.
దీనిని పరీక్షించేందుకు వారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దీనిని రైలు లేదా రోడ్డు మార్గంలో తీసుకు వెళ్లవచ్చు. అగ్ని-2కు అగ్ని-4 మోడిఫైడ్ వర్షన్. అగ్ని-2ను 2010 డిసెంబర్ 10వ తేదీన ప్రయోగించారు. అంతకుముందు, మొదటి పరీక్ష జనవరి 20వ తేదీన ఇదే ప్రాంతం నుండి చేశారు.