దక్షిణ చైనా సముద్రం మీద చైనా పెత్తనం: సత్తా చాటిన బ్రహ్మోస్: అరేబియా సముద్రంలో టార్గెట్ తుక్కు
చెన్నై: భారత నౌకాదళం అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ టెస్టింగ్ను డీఆర్డీఓ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద భారత్తో కయ్యానికి దిగుతోన్న చైనా.. దక్షిణ సముద్రంపైనా పట్టు సాధించడానికి ప్రయత్నాలు సాగిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్షలను అధికారులు నిర్వహించడం, దాన్ని విజయవంతం చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
Recommended Video
సముద్రంలోో ఎలాంటి లక్ష్యాన్నయినా తునాతునకలు చేయగలమని భారత్ హెచ్చరికలను పంపించినట్టయింది. ఆదివారం ఉదయం తాము నిర్వహించిన బ్రహ్మోస్ క్రూయిజ్ మిస్సైల్ టెస్టింగ్ విజయవంతమైనట్లు డీఆర్డీఓ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నౌకాదళ అవసరాల కోసం అత్యంత అధునిక సాంకేతిక పరిజ్ఙానంతో ఈ బ్రహ్మోస్ క్షిపణినిని రూపొందించినట్లు పేర్కొన్నారు. అత్యాధునిక బ్రహ్మోస్ క్షిపణిని రూపొందించడానికి భారత్.. రష్యా సహకారాన్ని తీసుకుంది. ఈ రెండు దేశాలు సంయుక్తంగా దీన్ని డిజైన్ చేశాయి.. డెవలప్ చేశాయి.
చెన్నైలో భారత నౌకాదళానికి చెందిన టెస్టింగ్ సెంటర్ నుంచి బ్రహ్మోస్ క్షిపణి పరీక్షను నిర్వహించారు. అరేబియా సముద్రంలో నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ క్షిపణి ధ్వంసం చేసినట్టు వెల్లడించారు. తాము నిర్దేశించిన బుల్ ఐని బ్రహ్మోస్ మిస్సైల్ ఛేదించిందని, ఇందులో పిన్ పాయింట్ అక్యూరసీని నమోదు చేసిందని తెలిపారు. సముద్రాల్లో మోహరించిన శతృదేశాల నౌకలను ఛేదించగల శక్తి సామర్థ్యాలు బ్రహ్మోస్ మిస్సైల్కు ఉన్నాయి. లాంగ్ రేంజ్లో ఉన్న ఉపరితల లక్ష్యాన్ని ఇవి ఛేదించగలవని నిరూపితమైనట్లు డీఆర్డీఓ అధికారులు తెలిపారు.
బ్రహ్మోస్ పరీక్ష విజయవంతం కావడం పట్ల రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్డీఓ అధికారులకు అభినందనలు తెలిపారు. సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైల్తో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమైందని చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందించిన ఈ మిస్సైల్ రాకతో నౌకాదళం మరింత దుర్బేధ్యంగా మారుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. డీఆర్డీఓ సతీష్ రెడ్డి.. బ్రహ్మోస్ను రూపొందించిన శాస్త్రవేత్తలు, ఇతర అధికారులను అభినందించారు. బ్రహ్మోస్ రాకతో తీర ప్రాంతాల్లో గస్తీ బలోపేతమౌతుందని అన్నారు.