ఒడిశా తీరంలో విజయవంతంగా క్షిపణి ప్రయోగం... మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్...
ఒడిశా తీరంలో భారత్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది. భూ ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్(MRSAM)ను భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఇజ్రాయెల్తో కలిసి సంయుక్తంగా తయారుచేసిన ఈ మిసైల్ను భారత సైన్యం కోసం డీఆర్డీవో ప్రత్యేకంగా తయారుచేసింది. బాలసోర్ జిల్లాలోని చాందీపూర్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్)లో ట్రక్కుపై నుంచి క్షిపణినీ విజయవంతంగా పరీక్షించారు. బుధవారం మధ్యాహ్నం 3.55గంటలకు ఈ క్షిపణిని ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు.
మొదట గగనతలంలోకి బన్షీ అనే బ్రిటీష్ డ్రోన్ (అన్ నేమ్డ్ ఎయిర్ వెహికల్)ను పంపించి... ఆ తర్వాత మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిసైల్తో దాన్ని టార్గెట్ చేశారు. ఈ మిసైల్ డైరెక్ట్గా లక్ష్యాన్ని టార్గెట్ చేసినట్లు చెప్తున్నారు. ముందు జాగ్రత్తలో భాగంగా చాందీపూర్లోని డీఆర్డోవో ప్లాంట్కు 2.5కి.మీ పరిధిలోని 8100 మందిని ఖాళీ చేయించినట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. క్షిపణి ప్రయోగం సందర్భంగా స్థానిక మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు కూడా జారీ చేశారు. గురువారం ఇదే మిసైల్తో రెండో ప్రయోగానికి డీఆర్డోవో సిద్దమవుతోంది.
దాదాపు 100కి.మీ దూరంలోని లక్ష్యాలను ఈ మిసైల్ చేధించగలదు. 4.5 మీటర్ల పొడవైన అణు సామర్థ్యం గల దీని బరువు సుమారు 2.7 టన్నులు. సుమారు 60కేజీల పేలోడ్ను ఇది మోసుకెళ్లగలదు.
ఈ ఏడాది నవంబర్లో డీఆర్డీవో చేపట్టిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ క్షిపణి ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. మెరుపు వేగంతో స్పందిస్తూ భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఈ మిసైల్ చేధించగలదు.