అగ్ని 5 క్షిపణి పరీక్ష విజయవంతం: 5వేల కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తుంది, చైనాను కవర్ చేస్తుంది
బాలాసోర్: రక్షణ రంగంలో మరో విజయం. అగ్ని-5 క్షిపణి పరీకషను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి డీఆర్డీవో దీనిని ఆదివారం ప్రయోగించింది. అయిదు వేల కిలో మీటర్ల పరిధిలో ఉన్న లక్ష్యాలను కూడా అగ్ని 5 క్షిపణి ఛేదించగలదు. ఈ విజయంతో అమెరికా, చైనా, రష్యా సరసన భారత్ చేరింది. అగ్ని 5 చైనాను దాదాపు కవర్ చేయగలదని నిపుణలు చెబుతున్నారు. భారత్ మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.
అణుబాంబులను మోసుకెళ్తూ 5 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఇది సులువుగా ఛేదిస్తుందని వెల్లడించారు. లాంచ్ ప్యాడ్4 పై నుంచి ఉదయం 9.48 గంటల ప్రాంతంలో దీన్ని ప్రయోగించామని, పూర్తి దూరాన్ని ఇది ప్రయాణించి, లక్ష్యాన్ని తాకిందని అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకూ అగ్ని 5 క్షిపణిని డీఆర్డీఓ ఆరుసార్లు ప్రయోగాత్మకంగా పరిశీలించింది. మిగతా అగ్ని శ్రేణిలోని క్షిపణులతో పోలిస్తే ఇది మరింత అత్యాధునికమైనదని, ఇంజన్, నావిగేషన్, గైడెన్స్, వార్ హెడ్ తదితరాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించామని తెలిపారు. అత్యంత కచ్చితత్వాన్ని చూపే ఆక్యురేట్ మైక్రో నావిగేషన్ సిస్టమ్ దీని ప్రత్యేకతని, లక్ష్యాన్ని గురి చూసి కొడుతుందన్నారు.
అగ్ని1 - 700 కి.మీ., అగ్ని2 - 2000 కి.మీ., అగ్ని3, అగ్ని 4 వెర్షన్లు 2,500 కి.మీ. నుంచి 3,500 కి.మీ. లక్ష్యాలను విజయవంతంగా ఛేదించగలవు. అగ్ని 5 వెర్షన్కు మరిన్ని పరీక్షలు నిర్వహించాలని డీఆర్డీఓ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ క్షిపణి దాదాపు చైనా మొత్తాన్నీ కవర్ చేస్తుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రయోగిస్తే రష్యాలోని అత్యధిక ప్రాంతాలు దీని రేంజ్లోకి వస్తాయి.