‘స్టార్వార్’ క్షిపణి దేశాల జాబితాలో భారత్!: సక్సెస్ఫుల్గా క్షిపణి ‘వినాశిని’ పరీక్ష
బాలాసోర్: భారత గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దే దిశగా మన రక్షణ శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు.'స్టార్వార్స్' తరహాలో గగనతలంలోనే శత్రు దేశ క్షిపణిని గుర్తించి వెంటనే ధ్వంసం చేయగల సాంకేతిక టెక్నాలజీ సామర్థ్యం మన సొంతమైంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ ఈ తరహా క్షిపణి వ్యవస్థను కలిగి ఉన్నాయి. వాటి సరసన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక సూపర్ సోనిక్ విధ్వంసక క్షిపణిని భారత్ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా పరీక్షించింది. ఇందులో 'పృథ్వి' క్షిపణి శత్రు క్షిపణి పాత్ర పోషించింది.
రక్షణ రంగంలో బహుళ అంచెల ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థను అందుబాటులో తెచ్చుకోవాలన్న వ్యూహంతో భారత రక్షణ శాఖ ముందుకు సాగుతున్నది. ఘన ఇంధనంతో నడిచే ఈ క్షిపణి వేగం ధ్వనికంటే ఐదు రెట్లు (సూపర్ సోనిక్) ఎక్కువగా ఉంటుంది. ఆకాశంలో తక్కువ ఎత్తులో శత్రు క్షిపణిని నేలకూల్చే సామర్థ్యం ఈ అస్త్రం సొంతం. అందుకు అనుగుణంగానే భూ వాతావరణ పరిధిలో అతి తక్కువగా 30 కిలోమీటర్ల ఎత్తులోని లక్ష్యాన్ని ఛేదించింది.
శత్రు క్షిపణి పాత్ర పోషించిన ‘పృథ్వి'
ఒడిశాలోని చాందీపూర్కు సమీపాన బంగాళాఖాతంలో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్)లో గురువారం ఉదయం 9.45 గంటలకు పరీక్షించింది. తాజా పరీక్షలో పృథ్వి క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్లో సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్) నుంచి ప్రయోగించారు. ఇది శత్రు క్షిపణి పాత్రను పోషించింది. దీని గమనాన్ని పసిగట్టిన రాడార్లు.. బంగాళాఖాతంలోని అబ్దుల్ కలాం దీవిలో ఉన్న అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ (ఏఏడీ) క్షిపణిని అప్రమత్తం చేశాయి. వెంటనే ఇది నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ‘శత్రు' అస్త్రాన్ని గాల్లో నేరుగా ఢీ కొట్టింది.
క్షిపణిలో అన్ని వ్యవస్థల పనితీరు ఇలా నిర్ధారణ
క్షిపణిని ప్రయోగించిన తర్వాత అందులోని అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేస్తున్నాయా? లేదా? అన్న అంశాన్ని నిర్ధారించుకునేందుకు ఈ పరీక్ష జరిగిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది పృథ్వి క్షిపణికి జరిగిన మూడో పరీక్ష ఇది. ఇంతకుముందు దీనిని డీఆర్డీవో రెండుసార్లు (ఫిబ్రవరి 11, మార్చి ఒకటో తేదీన) పరీక్షించింది. సొంత మొబైల్ లాంచర్ను కలిగి ఉండటంతోపాటు అత్యాధునిక రాడార్ల సాయంతో శత్రు క్షిపణుల జాడను కనిపెట్టి ఢీకొట్టగల సామర్థ్యం దీని సొంతం. శత్రుదేశాల ఖండాంతర క్షిపణుల లక్ష్యాల పరిధిలో ఉన్న అత్యున్నత స్థాయి సంస్థలను పృథ్వి సురక్షితంగా కాపాడగలదు. శత్రుదేశాలు శక్తి వంతమైన క్షిపణులు ప్రయోగిస్తే, వాటిని మధ్యలోనే ధ్వంసం చేయడం ఎలా అనే అంశంపై డీఆర్డీవో తీవ్ర కసరత్తే చేసింది.
గురిచూసి మరీ కొట్టారు
వాస్తవానికి శత్రుదేశాలు ప్రయోగించే క్షిపణులు రెండు రకాలు. అవి వాతావరణం కన్నా పైనుంచి, వాతావరణంలోనే ప్రయాణించేవి. వీటిని ముందుగా పసిగట్టి నాశనం చేసే క్షిపణులనే అధునాతన ఎయిర్ డిఫెన్స్ సూపర్సోనిక్ ఇంటర్సెప్టర్ క్షిపణులు అంటారు. ఇప్పుడు భారత్ పరీక్షించింది కూడా ఇదే! ‘ఈ పరీక్ష ద్వారా మన సామర్థ్యాలను తెలుసుకోవాలని భావించాం. ఇంటర్సెప్టర్ క్షిపణిలో ఉపయోగించింది అంతా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానమే. దీనిలో ఉపయోగించిన ఫైబర్ ఆప్టిక్ జైరోలు, రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్స్, గైడెన్స్ సిస్టమ్ అన్నీ మనమే తయారు చేసుకున్నాం. దూరంలో ఉన్న క్షిపణిని అత్యాధునిక రాడార్ల ద్వారా గమనించి, దాని గమనాన్ని పసిగట్టి, దాన్ని ఎక్కడి నుంచి ఛేదించాలో విశ్లేషించి, దాడి చేయడం సామాన్యమైన విషయం కాదు. ఈ తరహా సామర్థ్యం అతి కొద్ది దేశాలకు మాత్రమే ఉంది. పృథ్వి క్షిపణి అత్యంత అధునాతనమైనది. దీన్ని కనిపెట్టి నాశనం చేయడం అంత సులభం కాదు' అని ఈ పరీక్షలో పాల్గొన్న డీఆర్డీవో అధికారి ఒకరు తెలిపారు.
Recommended Video
అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి ఇలా
బరువు 1.2 టన్నులు. పొడవు 7.5 మీటర్లు. చుట్టుకొలత 0.5 మీటర్లు. ఈ క్షిపణిలో ఒకటే దశ ఉంటుంది. దీనిలో ఘన ఇంధనాన్ని ఉపయోగించారు. ఇక పృథ్వి విషయానికి వస్తే...దీని బరువు 5 టన్నులు. పొడవు 11 మీటర్లు. చుట్టుకొలత ఒక మీటర్. ఇది ద్రవ ఇంధనంతో పనిచేస్తుంది. 7.5 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణిలో నావిగేషన్ సిస్టంతో పాటు హైటెక్ కంప్యూటర్ను కూడా అనుసంధానం చేసినట్లు పేర్కొన్నాయి. తాజా పరీక్షలో రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు, క్షిపణులు, వ్యూహాత్మక వ్యవస్థల డైరెక్టర్ జనరల్ డా.సతీష్రెడ్డి ప్రయోగాన్ని పర్యవేక్షించారు. ఏఏడీ ప్రాజెక్టు డైరెక్టర్ శశికళా సిన్హా, ప్రోగ్రామ్ డైరెక్టర్ యు రాజబాబు కీలక భూమిక పోషించారు.