జమ్మూకశ్మీర్ ఎన్కౌంటర్... పాకిస్తాన్ హైకమిషన్కు సమన్లు జారీ చేసిన భారత్...
రెండు రోజుల క్రితం జమ్మూకశ్మీర్లోని నగ్రోటాలో జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించి పాకిస్తాన్ హైకమిషన్కు భారత్ నోటీసులు జారీ చేసింది. ఇకనైనా ఉగ్రవాదులకు సహకరించే ధోరణిని మానుకోవాలని నోటీసుల్లో పాక్ను హెచ్చరించింది.ద్వైపాక్షిక కట్టుబాట్లను అతిక్రమించి భారత్కు వ్యతిరేకంగా పాక్ భూభాగంపై ఎటువంటి ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించవద్దని పేర్కొంది.
గురువారం(నవంబర్ 19) జమ్మూ-శ్రీనగర్ హైవేపై నగ్రోటా సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. భారత్లోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న సమాచారంతో... నగ్రోటా టోల్ ప్లాజా వద్ద ఓ ట్రక్కును భద్రతా దళాలు తనిఖీ చేశాయి. ఆ సమయంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమవగా... ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
హతమైన ఉగ్రవాదుల నుంచి 11ఏకె 47 రైఫిల్స్,మూడు గన్స్,29 గ్రెనేడ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ముంబై 26/11 దాడులు జరిగి 12 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జైషే మహమ్మద్ భారత్లో భారీ విధ్వంసానికి కుట్ర చేసినట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ఘటనపై ప్రధాని మోదీ,హోంమంత్రి అమిత్ షా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత సైనికులను ప్రధాని అభినందించారు. భారత సైన్యం మరోసారి అత్యంత సాహాసాన్ని,పోరాట పటిమను ప్రదర్శించిందన్నారు. అప్రమత్తంగా వ్యవహరించి ముప్పును తప్పించినందుకు సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. జమ్మూకశ్మీర్లో జరుగుతున్న స్థానిక ఎన్నికలను ప్రక్రియను ఉగ్రవాదులు అడ్డుకునే ప్రయత్నానికి సైన్యం చెక్ పెట్టిందన్నారు.
Recommended Video
ఎన్కౌంటర్ తర్వాత జమ్మూ శ్రీనగర్ హైవేని మూసివేశారు. ప్రస్తుతం అక్కడ భారీగా బలగాలను మోహరించారు. సంఘటనా స్థలం నుంచి పారిపోయిన ట్రక్కు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.