రష్యాను దాటేసిన భారత్... కరోనా కేసుల్లో వరల్డ్ టాప్-3...
కరోనా కేసుల సంఖ్యలో భారత్ పైకి ఎగబాకుతూనే ఉంది. నిన్నటివరకూ కరోనా కేసుల రీత్యా ప్రపంచ దేశాల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న భారత్ నేడు మూడో స్థానానికి చేరింది. ఆదివారం(జూలై 5) నమోదైన కేసులతో భారత్ రష్యాను దాటేసింది. జాన్స్ హోప్కిన్స్ యూనివర్సిటీ ట్రాకర్ ప్రకారం ప్రస్తుతం రష్యాలో కేసుల సంఖ్య 6,80,283 కాగా.. covid19india.org ప్రకారం ప్రస్తుతం భారత్లో కరోనా కేసుల సంఖ్య 6,97,069 ఉంది.
కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం జూలై 4 నాటికి దేశంలో కేసుల సంఖ్య 6,73,165గా ఉంది. అంటే,24గంటల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా కొత్తగా 23వేల పైచిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో మహారాష్ట్రలో 6555 కేసులు,తమిళనాడులో 4150 కేసులు,ఢిల్లీలో 2,505 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే కరోనాతో 151 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 86,040 పాజిటివ్ కేసులున్నాయి. ఇప్పటివరకూ 8222 మంది కరోనాతో మృతి చెందారు.
ఇక తమిళనాడులో ప్రస్తుతం 48,860 యాక్టివ్ కేసులు ఉండగా... ఇప్పటివరకూ కరోనాతో 1510 మంది మృతి చెందారు. ఢిల్లీలో ప్రస్తుతం 25,038 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటివరకూ 3067 మంది పేషెంట్లు మృతి చెందారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2,52,402 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.