భారత్, పాక్ చర్చలు రద్దు: స్పష్టం చేసిన దోవల్
న్యూఢిల్లీ: ఈనెల 15న భారత్, పాకిస్థాన్ దేశాల విదేశాంగ కార్యదర్శుల మధ్య జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. ఈ విషయాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. పఠాన్కోట్ దాడి సూత్రధారులపై పాకిస్థాన్ చర్యలు తీసుకునేవరకు చర్చలు జరగవని ఆయన స్పష్టం చేశారు.
ఈ మేరకు సోమవారం ఆయన ప్రకటన చేశారు. పాక్ చర్యలపై భారత్ సంతృప్తి చెందిన తర్వాత చర్చలపై పునరాలోచిస్తామని అన్నారు. అప్పటి వరకు భారత్, పాకిస్థాన్ల మధ్య చర్చల ప్రక్రియ కొనసాగదని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పఠాన్కోట్ ఉగ్రదాడికి సంబంధించిన సాక్ష్యాలను భారత్ తమకు అందించిందని పాక్ విదేశాంగశాఖ సైతం అంగీకరించింది.
సాక్ష్యాల ప్రకారం దోషులపై చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది. గతవారంలో పఠాన్కోట్ తీవ్రవాద దాడికి సంబంధించి ఇస్లామాబాద్కు అందచేసిన సమాచారంపై చర్య తీసుకుంటేనే పాకిస్తాన్తో విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలు భారత్ జరుగుతాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ అన్నారు.
చర్య తీసుకోవడానికి అవసరమయ్యే నిఘా వర్గాల సమాచారాన్ని పాకిస్తాన్కు అందచేశామని చెప్పారు. దానిపై పాక్ చర్య ఏమిటన్నదానిపై భారత్ వేచిచూస్తోందన్నారు. ''ప్రస్తుతం బంతి పాక్ కోర్టులో వుందని'' ఆయన వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ పాక్ ప్రధానితో ఫోన్లో మాట్లాడారని, వెంటనే తగు రీతిలో స్పందిస్తామని ఆయన హామీ ఇచ్చారని చెప్పారని స్వరూప్ తెలిపారు. ఆ స్పందన ఏమిటో, ఏ విధంగా వుంటుందో తాము వేచి చూస్తున్నామన్నారు. దీనికి గడువు ఏమీ విధించలేదన్నారు. చర్చలపై భారత్ వైఖరి గురించి చెప్పాలంటే పదే పదే ప్రశ్నించగా ఇప్పుడే చెప్పలేమన్నారు.