ఇక పాకిస్తాన్కు చుక్కలే.. భారీగా ఫైటర్ జెట్లను పోగేస్తోన్న ఎయిర్ ఫోర్స్.. డిఫెన్స్ సెక్రటరీ కీలక ప్
ఏ క్షణమైనాసరే.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోడానికి రెడీగా ఉన్నామంటూ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ రణవణె ప్రకటించిన కొద్దిగంటలకే ఆయుధ సంపత్తికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) కీలక విషయాన్ని వెల్లడించింది. అతి త్వరలోనే 200 ఫైటర్ జెట్ యుద్ధవిమానాలు ఐఏఎఫ్ అమ్ములపొదిలో చేరనున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విషయాలను వెల్లడించారు.
ఎయిర్ ఫోర్స్ లోకి ఇటీవలే వచ్చిచేరిన రాఫెల్ సహా సుఖోయ్ 30, మిరాజ్ 2000, మిగ్ 29, పాత జాగ్వార్స్, మిగ్ 21 బైసన్స్ అందుబాటులో ఉన్నాయని, అయితే అత్యవసర అవసరాలకు కూడా పనికొచ్చేలా సుమారు 200 విమానాలను కొనుగోలుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అజయ్ కుమార్ చెప్పారు. హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 83 తేజాస్ ఎయిర్ క్రాఫ్ట్ ల తయారీ చివరి దశలో ఉందని, ఇవి కాకుండా మరో 110 విమానాల కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఇఓఐ), రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పి) రెడీ చేశామని ఆయన వివరించారు.
ఎయిర్ ఫోర్స్ ను బలోపేతం చేసే పనిని వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళతామని, అందుకోసం చేయగలిగిందంతా చేస్తున్నామని, అవసరమైతే ఔట్ సోర్సింగ్ సేవలను కూడా వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు రక్షణ శాఖ కార్యదర్శి తెలిపారు. ఎయిర్ ఫోర్స్ లో కీలకంగా వ్యవహరించి, 1999 కార్గిల్ యుద్ధంలో సత్తా చాటిన మిగ్ 27 యుద్ధవిమానాలను ఇటీవలే రద్దు చేసిన సంగతి తెలిసిందే. కొత్త విమానాలపై కేంద్రం ప్రకటన రాజకీయంగానూ చర్చనీయాంశమైంది.