అక్టోబర్ 2 నుంచి ఆరు రకాల ప్లాస్టిక్ వస్తువుల బ్యాన్.. విక్రయం, ఉత్పత్తి కూడా నిషేధమే...
న్యూఢిల్లీ : జాతి పిత మహత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా నరేంద్ర మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. దేశంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిషేధిస్తామని స్పష్టంచేసింది. ఇందులో నిత్యం వాడే ఆరు ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయని పేర్కొన్నది. ప్లాస్టిక్ భూతంతో పర్యావరణంపై పెను ప్రభావం చూపిస్తోంది. దీనిపై ఇప్పటికే మేధావులు, పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్లాస్టిక్ నిషేధంపై కేంద్ర ప్రభుత్వం సమరశంఖం పూరించింది.
అలర్ట్.. అలర్ట్... గుజరాత్ తీరం గుండా ఉగ్రవాదులు... ఐబీ హెచ్చరిక, అప్రమత్తమైన కోస్టల్ పోలీసులు
గాంధీ జయంతి నుంచి ..
గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుంచి ఆరురకాల ప్లాస్టిక్ వస్తువులను నిషేదిస్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల వరకు అన్నీ చోట్ల ప్లాస్టిక్పై నిషేధం అమలు చేస్తామని పేర్కొన్నారు. 2022 వరకు ప్లాస్టిక్ రహిత దేశం ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఇదివరకే ప్రధాని మోడీ చెప్పారు. దానికి అనుగుణంగా ప్రణాళిక రచించి ముందుకుసాగుతున్నారు. ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ వస్తువులు .. ప్లాస్టిక్ బ్యాగులు, కప్పులు, ప్లేట్లు, చిన్న బాటిళ్లు, స్ట్రా, సాచెట్లు నిషేధ జాబితాలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టంచేశారు.
ఉత్పత్తి కూడా ..
ప్లాస్టిక్ వస్తువులను వాడటమే కాదు .. ఉత్పత్తి కూడా నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. ప్లాస్టిక్ నిషేధంపై పంద్రాగస్టు సందేశంలో ప్రధాని మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఓకేసారి వాడి పడేసి ప్లాస్టిక్ ఉత్పత్తులతో పర్యావరణం కలుషితమవుతోంది. ముఖ్యంగా మహాసముద్రాల్లో ప్లాస్టిక్ చేరి .. సముద్ర జీవజాలం ఉనికి ప్రశ్నార్థకం చేస్తోంది. తర్వాత అదీ మానవ ఆహార ఉత్పత్తులపై ప్రభావం చూపిస్తోంది. 2021 వరకు ప్లాస్టిక్ను సమూలంగా నిర్మూలించాలని ఇప్పటికూ యూరోపియన్ యూనియన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. యూరోపియన్ యూనియన్ స్ట్రా, ఫోర్కు, కత్తులు, కాటన్ పుల్లలను 2021 వరకు బ్యాన్ కూడా చేసింది. చైనా కూడా యూరోపియన్ యూనియన్ బాటలో నడుస్తోంది.
ఈ కామర్స్ వెబ్ సైట్లు కూడా ..
భారతదేశంలో నిషేధం విధించే ఆరు రకాల ప్లాస్టిక్ వస్తువులతో 14 శాతం టన్నుల ప్లాస్టిక్ ఆగిపోతుందని అధికారులు అంచనా వేశారు. ప్లాస్టిక్ రద్దుచేసిన తర్వాత కూడా వినియోగించే వారిపై భారీగా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వంపై ప్లాస్టిక్పై యుద్ధం చేస్తుంటే ... ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులపై నిషేధం విధించాయి. మరోవైపు ఈ కామర్స్ వైబ్ సైట్లు కూడా ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని తేల్చిచెప్పాయి. దేశంలో అన్ని విభాగాలు కేవలం ప్యాకింగ్ కోసమే 40 శాతం ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నాయి. దీంతో ఈ అంశంపై కూడా కేంద్ర ప్రభుత్వం ఫోకస్ చేసి ... ఆయా సంస్థలకు అల్టిమేటం జారీచేశాయి.