ఢిల్లీలో జరిగే ఆ సమావేశానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ను ఆహ్వానించనున్న భారత్
న్యూఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిన నేపథ్యంలో భారత్ ఒక అడుగు ముందుకేసింది.న్యూఢిల్లీ వేదికగా ఈ ఏడాది జరగనున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను ఆహ్వానిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉగ్రవాదం, చర్చలు రెండూ ఒకే తాటిపై ఉండవని గతంలో చెప్పిన భారత్ ఇందుకు భిన్నంగా సదస్సులో పాల్గొనాల్సిందిగా పాక్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు ఆహ్వానం పలికింది.
ఢిల్లీ వేదికగా జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సుకు మొత్తం 8 దేశాలతో పాటు నాలుగు పరిశీలక దేశాలను కూడా ఆహ్వానిస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. 1996లో ఐదు సభ్య దేశాలతో షాంఘై సమాఖ్య ఏర్పాటు అయ్యింది. అయితే 2017కు ఆ సభ్య దేశాల సంఖ్య ఎనిమిదికి చేరింది. భారత్ పాకిస్తాన్లు కూడా సభ్య దేశాలుగా 2017లో చేరాయి. అంతకుముందు కశ్మీర్ అంశంలో ఐక్యరాజ్యసమితిలో చైనా జోక్యం చేసుకోవడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
చైనా ద్వారా ఐక్యారాజ్యసమితిలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తాలని చూసిన పాకిస్తాన్కు ఇతర దేశాల నుంచి మద్దతు లభించకపోవడంతో భంగపాటు తప్పలేదు. కశ్మీర్ అంశం రెండుదేశాలకు సంబంధించిన వ్యవహారమని ప్రపంచ దేశాలు భావించి ఇందుకు ఐక్యరాజ్యసమితి భద్రతామండలి వేదిక కాకూడదని చెబుతూ దూరంగా నిలిచాయి. భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ ఇలాంటి అంశాలను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించకపోవడమే ఆదేశానికి మంచిదని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ చెప్పారు.
జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేస్తూ గతేడాది ఆగష్టులో కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి పాకిస్తాన్కు మద్దతుగా నిలుస్తూ వస్తోంది చైనా. ఈ అంశంపై ఇప్పటికే మూడుసార్లు ప్రస్తావించిన చైనాకు సైతం భంగపాటు తప్పలేదు. గతంలో ఈ అంశాన్ని భద్రతామండలిలో లేవనెత్తేందుకు చైనా ప్రయత్నించగా ఆ ప్రయత్నాలను ఫ్రాన్స్, అమెరికా దేశాలు అడ్డుకున్నాయి. కశ్మీర్ అంశం లేవనెత్తాలని భావించిన పాకిస్తాన్కు గట్టి సంకేతాలు వెళ్లాయని తాను భావిస్తున్నట్లు రవీష్ కుమార్ చెప్పారు. భారత్-పాక్ దేశాల మధ్య ఏమైనా అంశాలు ఉంటే వాటిని ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రవీష్ కుమార్ చెప్పారు.