సరిహద్దులో కాల్పుల విరమణకు తూట్లు... పాక్కు సమన్లు జారీ చేయనున్న భారత్...
జమ్మూకశ్మీర్లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి పాక్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుండటంపై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. శుక్రవారం(నవంబర్ 13) నాటి కాల్పుల ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్న భారత్... పాక్ దౌత్యాధికారికి సమన్లు జారీ చేయనుంది. పాకిస్తాన్,ఆఫ్ఘనిస్తాన్,ఇరాన్(పీఏఐ) డెస్క్లోని భారత విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ జేపీ సింగ్ కూడా పాకిస్తాన్ హైకమిషన్పై తీవ్ర నిరసన వ్యక్తం చేసేందుకు సిద్దమవుతున్నారు.
భారత దౌత్యాధికారికి పాక్ నోటీసులు...
మరోవైపు ఈ వ్యవహారంపై భారత్తో చర్చించేందుకు పాకిస్తాన్ దౌత్యవేత్త జావద్ అలీ(కౌన్సెలర్) భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో సమావేశం కానున్నట్లు పాక్ వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం(నవంబర్ 13) పాకిస్తాన్ భారత్కు చెందిన ఓ సీనియర్ దౌత్యవేత్తకు రెండుసార్లు సమన్లు జారీ చేసింది. కశ్మీర్లో కాల్పుల ఉదంతంపై చర్చించేందుకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. శనివారం(నవంబర్ 14) పాక్ డైరెక్టర్ జనరల్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(DG-ISPR) మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికర్,పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ఇదే అంశంపై ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.
అసలేం జరిగింది...
ప్రాథమిక సమాచారం ప్రకారం... శుక్రవారం(నవంబర్ 13) కశ్మీర్లోని కెరన్ సెక్టార్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి భారత బలగాలు అనుమానాస్పద కదలికలను గమనించాయి. పాక్ వైపు నుంచి భారత్లోకి ఉగ్రవాదుల చొరబాటుయత్నం జరుగుతున్నట్లు గుర్తించింది. వెంటనే భారత బలగాలు అప్రమత్తమవడంతో.. పాక్ కాల్పులతో విరుచుకుపడింది. దీంతో ఐదుగురు భద్రతా సిబ్బంది సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పాక్ కాల్పులకు భారత్ ఎదురుకాల్పులతో ధీటుగా బదులిచ్చింది. దీంతో 11 మంది పాకిస్తాన్ జవాన్లు చనిపోయారు. మరో 16 మంది గాయపడ్డారు.
Recommended Video
భారత్ క్షిపణి దాడులు...
పాక్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడంతో భారత బలగాలు తీవ్ర స్థాయిలో కౌంటర్ ఎటాక్ చేశాయి. ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలను పేల్చేశాయి. ఇటీవలే ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన స్పైక్ యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ను పాక్ స్థావరాలపై భారత్ ఎక్కుపెట్టింది. బంకర్లు,ఆయుధ కేంద్రాలు,ఉగ్రవాదులను భారత్లోకి పంపించేందుకు ఏర్పాటు చేసిన స్థావరాలను పేల్చేసింది. చనిపోయిన పాక్ సైనికుల్లో స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమెండోలు ఇద్దరు ఉన్నట్లు భారత ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పాక్ స్థావరాలపై భారత్ క్షిపణి దాడులకు సంబంధించి వీడియోలు కూడా బయటకొచ్చాయి. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.