Delhi Exit Poll Result 2020:: హస్తిన కిరీటధారి.. కేజ్రీవాల్: ఆమ్ ఆద్మీ కే జైకొట్టిన ఢిల్లీ ఓటర్
Recommended Video
న్యూఢిల్లీ: యావత్ దేశ పరిపాలనకు కేంద్రబిందువుగా భావించే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జయకేతనం ఎగురవేయడం ఖాయంగా కనిపిస్తోంది. హస్తిన కిరటీధారిగా మరోసారి ఆ పార్టీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆవిర్భవించనున్నారు. కేజ్రీవాల్.. వరుసగా రెండోసారి ఢిల్లీముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం లాంఛనప్రాయమేనంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
క్లీన్ స్వీప్ దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ..
దేశ రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీకి తిరుగులేని మెజారిటీ లభించబోతోందని ఇండియా టుడే-మై యాక్సిస్ సర్వే అంచనా వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని వెల్లడించింది. పశ్చిమ ఢిల్లీ, చాందినీ చౌక్, వాయవ్య ఢిల్లీ ప్రాంతాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని మెజారిటీని సాధిస్తుంందని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. పశ్చిమ ఢిల్లీ ప్రాంతంలో 9 నుంచి 10, చాందినీ చౌక్ ప్రాంతంలో 9 నుంచి 10 స్థానాలను అవలీలగా గెలుచుకుంటుందని అంచనా వేసింది.
వాయవ్య ఢిల్లీలోనూ అదే హవా..
వాయవ్య ఢిల్లీ ప్రాంతంలోనూ కూడా అరవింద్ కేజ్రీవాల్ మాయాజాలం కొనసాగుతుందని అభిప్రాయ పడింది. ఈ ప్రాంతంలో 7 నుంచి 9 సీట్లను ఆమ్ ఆద్మీ పార్టీ తన ఖాతాలో వేసుకుంటుందని వెల్లడించింది. పశ్చిమ ఢిల్లీ, వాయవ్య ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, చాందినీ చౌక్, తూర్పు ఢిల్లీల్లో మొత్తం 50 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఒక్క ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే ఎంత లేదన్నా 41 నుంచి 48 సీట్లపై జెండా పాతుతుందని ఇండియా టుడే- మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. ఇక 20 స్థానాలు ఉన్న సెంట్రల్ ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొంది.
కమలం, కాంగ్రెస్ ఒకే గాటన..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు కమల నాథులు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకే గాటన కట్టేశారనే విషయం ఎగ్జిట్ పోల్స్ ద్వారా తేటతెల్లమౌతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ హవా ధాటికి, అరవింద్ కేజ్రీవాల్ వాగ్ధాటి ముందు ఈ రెండు పార్టీలు నిలవలేకపోయాయని స్పష్టమౌతోంది. భారతీయ జనతా పార్టీకి దక్కే స్థానాల సంఖ్య రెండంకెలు కూడా ఉండకపోవచ్చని ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరీ దయనీయంగా ఉందని, ఈ ఎన్నికల్లో ఖాతా తెరిచే అవకాశాలు తక్కువేనని పేర్కొంది.
గత ఎన్నికల తరహాలోనే
2015లో నిర్వహించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉందో మనకు తెలిసిందే. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా 68 సీట్లను గెలుచుకుంది. బీజేపీని కేవలం మూడు స్థానాలకే పరిమితం చేసింది. కాంగ్రెస్ దక్కిన స్థానాల సంఖ్య జీరో.. అదే పరిస్థితి, అదే తరహా వాతావరణం ఈ సారి కూడా పోలింగ్ సందర్భంగా కనిపించిందని ఇండియా టుడే-మై యాక్సిస్ వెల్లడించింది. ఒక్క ఇండియా టుడే మాత్రమే కాదు.. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే తరహా అంచనా వేశాయి.