ఇండియా టుడే ఎగ్జిట్ పోల్: మహారాష్ట్ర బీజేపీ-శివసేనదే, హర్యానాలో కమలం హవా
ముంబై: మహారాష్ట్ర, హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ నేడు (అక్టోబర్ 21) పూర్తయింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరిగింది. నిర్ణీత సమయంలోపు వరుసలో నిలిచిన వారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లోను ఓటింగ్ శాతం తగ్గింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీలు జోరుగా ప్రచారం చేశాయి. మహారాష్ట్ర, హర్యానాలో 4,406 మందికి వరకు అభ్యర్థులు బరిలో ఉన్నారు. మరోవైపు, తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. దేశవ్యాప్తంగా 51 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో మహారాష్ట్ర, హర్యానాల్లో బీజేపీదే హవా అని తేలింది. మహారాష్ట్రలో 288 స్థానాలకు గాను బీజేపీ-శివసేన-ఇతర మిత్రపక్షాలు కలిసి 166 నుంచి 194 స్థానాలు గెలుచుకుంటాయని ఈ ఫలితాల్లో తేలింది. కాంగ్రెస్ - ఎన్సీపీ కలిపి కేవలం 72 నుంచి 90 మధ్య స్థానాలు మాత్రమే వస్తాయని తెలింది. ఇతరులు 22 నుంచి 34 చోట్ల గెలుచుకుంటారని ఎగ్జిట్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
బీజేపీకి ఒంటరిగా 109 నుంచి 124 సీట్లు వస్తాయని, శివసేనకు 57 నుంచి 70 సీట్లు వస్తాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. అదే సమయంలో కాంగ్రెస్ 32 నుంచి 40, ఎన్సీపీ 40 నుంచి 50 సీట్లు గెలుచుకుంటుందని అంచనా.
హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో నష్టపోతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రతో పాటు హర్యానాలోను బీజేపీదే హవా అని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో వెల్లడైంది.