కరోనాపై భారత్ చర్యలు నిర్ణయాత్మకం- ప్రపంచ బ్యాంకు ప్రశంసలు
కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో భారత్ చేపడుతున్న చర్యలకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలో అందరి కంటే ముందుగా దేశీయ వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచ ఆర్ధిక శక్తులుగా ఉన్న అమెరికా, చైనా వంటి దేశాలు స్వాగతిస్తుండగా.. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు కూడా వారి సరసన చేరింది.
కరోనాను నియంత్రించడంతో పాటు ఆర్ధిక వ్యవస్ధపై దాని దుష్పరిణామాలు లేకుండా చేయడంలో భారత్ తీసుకుంటన్న చర్యలు ఎంతో నిర్ణయాత్మకంగా ఉన్నాయని ఐఎంఎఫ్ ఛీఫ్ క్రిస్టాలినా జార్జీవా ప్రశంసించారు. ఈ ఏడాదిలో ఆర్ధిక వ్యవస్ధ మరింత పుంజుకునేలా మరిన్ని చర్యలు చేపట్టాలని భారత్కు ఆమె సూచించారు. భారత్ చేపడుతున్న చర్యల కారణంగా జనవరి 26న ప్రకటించే ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధల స్ధితిగతుల నివేదికలోనూ భారత్ పరిస్ధితి అంత దారుణంగా ఉండకపోవచ్చని ఆమె వెల్లడించారు.
ఎంతో రద్దీగా ఉండే భారత్ వంటి దేశాల్లో నాటకీయంగా విధించిన లాక్డౌన్ను కూడా ఐఎంఎఫ్ ఛీఫ్ గుర్తుచేశారు. సమయానుకూలంగా విధించిన ఆంక్షలు, వాటిని ఎత్తివేసిన తీరు కారణంగానే ఆర్ధిక వ్యవస్ధ కోలుకోగలిగిందని ఆమె పేర్కొన్నారు. దేశ జీడీపీలో ఆరుశాతం నిధుల్ని కరోనా నియంత్రణ చర్యలకు కేటాయించడంపైనా ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని నిధులు ఇచ్చి ఆర్ధిక వ్యవస్ధను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం 2021లో తగిన ప్రయత్నాలు చేయాలని ఆమె భారత్ను అభ్యర్ధించారు.