అవినీతిలో భారత్ ఆసియాలోనే టాప్.. షాకింగ్ విషయాలు వెల్లడించిన లేటెస్ట్ సర్వే...
ఆసియాలోనే అత్యంత అవినీతిమయ దేశంగా భారత్ నిలిచినట్లు ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సర్వే వెల్లడించింది. భారత్లో 39శాతం అవినీతి జరుగుతున్నట్లు తెలిపింది. 46శాతం మంది వ్యక్తులు వ్యక్తిగత పరిచయాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ సేవలు పొందుతున్నట్లు పేర్కొంది. లంచం ఇచ్చినవారిలో దాదాపు 52శాతం మందిని వివరాలు అడగ్గా... 32శాతం మంది తమ వ్యక్తిగత పరిచయాలను అందుకోసం ఉపయోగించుకున్నట్లు తెలిపారు. లేదంటే పని జరగదని వారు పేర్కొనడం గమనార్హం.
గత 12 నెలల్లో 47శాతం అవినీతి...
గత 12 నెలల్లో భారత్లో అవినీతి పెరిగినట్లు 47శాతం మంది సర్వేలో అభిప్రాయపడ్డారు. అదే సమయంలో అవినీతిని ఎదుర్కోవడంలో ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరిస్తోందని 63శాతం మంది అభిప్రాయపడ్డారు. గ్లోబల్ కరప్షన్ బారోమీటర్-ఆసియా పేరుతో విడుదల చేసిన ఈ సర్వే కోసం ఆసియాలోని 17 దేశాల్లో దాదాపు 2లక్షల మంది నుంచి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ సంస్థ అభిప్రాయాలు సేకరించింది. గడిచిన 12 నెలల్లో అవినీతితో వారికి ఎదురైన అనుభవాలకు సంబంధించిన వివరాలు సేకరించింది.
ఏయే వ్యవస్థల్లో
ఇందుకోసం ప్రధానంగా పోలీస్ వ్యవస్థ,ప్రభుత్వ ఆస్పత్రులు,ధ్రువీకరణ పత్రాలు,ఇతరత్ర సేవలకు సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకుంది. భారత్లో 42శాతం మంది ప్రజలు పోలీసులకు లంచాలు చెల్లిస్తున్నట్లు సర్వేలో వెల్లడించారు. అలాగే అధికారిక ధ్రువీకరణ పత్రాల కోసం లంచం చెల్లించిస్తున్నట్లు 41శాతం మంది చెప్పారు. ఈ ఏడాది జనవరిలో దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్లో ఇదే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన సర్వేలో.. అవినీతి దేశాల్లో భారత్ 80వ స్థానంలో ఉంది.
బ్రైబరీ రిస్క్ జాబితాలో 77వ స్థానం..
ఇటీవల 'ట్రేస్ బ్రైబరీ రిస్క్ మ్యాట్రిక్స్' సంస్థ వెల్లడించిన బ్రైబరీ రిస్క్ జాబితాలో... 45 స్కోర్తో భారత్కు 77వ స్థానం దక్కింది. గతేడాదితో పోల్చితే భారత్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా 194 దేశాల్లో.. అక్కడి వ్యాపార వ్యవహారాల్లో ముడుపుల ప్రభావాన్ని ఈ సంస్థ అంచనా వేస్తుంది.
ఈ విషయంలో పొరుగు దేశాలైన పాకిస్తాన్,చైనా,నేపాల్,బంగ్లాదేశ్ల కంటే భారత్ మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. అయితే మన పక్కనే ఉన్న భూటాన్ మాత్రం భారత్ కంటే మెరుగైన స్థితిలో ఉంది. 37 స్కోర్తో ఆ దేశం బ్రైబరీ రిస్క్ జాబితాలో 48వ స్థానంలో నిలిచింది.జాబితాలో అత్యంత అట్టడుగున.. చివరిదైన 194వ స్థానంలో సోమాలియా నిలిచింది. 2017-2019లో ఆ దేశం 187వ ర్యాంకులో ఉండగా... ఇప్పుడు మరింత దిగజారింది.