ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్: 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే బీజేపీదేదే పైచేయి, కానీ
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు మరెంతో దూరం లేదు. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అప్పుడే ర్యాలీలతో తన ప్రచారం ప్రారంభించారు. యూపీలో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ పొత్తు కుదుర్చుకున్నాయి. బీహార్లో బీజేపీ, జేడీయూ మధ్య పొత్తు కుదిరింది. ఇక్కడ 40 స్థానాలకు గాను రెండు పార్టీలు చెరో 17 చోట్ల పోటీ చేసి, మిగతా స్థానాలు ఇతర మిత్రపక్షాలకు ఇవ్వనున్నాయి.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందా, విపక్షాలన్నీ ఏకమై కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేలా పరిస్థితులు ఉంటాయా లేక మూడో కూటమి చక్రం తిప్పుతుందా అనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ 2019 పేరుతో బీహార్, మహారాష్ట్ర, జార్ఖండ్, గోవా, ఉత్తర ప్రదేశ్లలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఉత్తర ప్రదేశ్
ఉత్తర ప్రదేశ్లో 80 సీట్లు ఉండగా ఇప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి 40 సీట్లు, బీఎస్పీకి 15, ఎస్పీకి 15, కాంగ్రెస్ పార్టీకి రెండు సీట్లు వస్తాయని ఈ సర్వేలో వెల్లడైంది. ఓట్ షేర్ విషయానికి వస్తే బీజేపీకి 37 శాతం, బీఎస్పీకి 10 శాతం, ఎస్పీకి 23 శాతం, కాంగ్రెస్ పార్టీకి 10 శాతం, ఇతరులకు 11 శాతం రానున్నాయి.
బీహార్లో 40 సీట్లు
బీహార్లోని 40 సీట్లకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 27 సీట్లు గెలుచుకుంటుంది. పార్టీల వారీగా చూస్తే బీజేపీ 13, జేడీయూ 11, కాంగ్రెస్ 2, ఆర్జేడీ 10 సీట్లు, ఇతరులు నాలుగు సీట్లు గెలుచుకుంటారని సర్వేలో తేలింది. ఎన్డీయేకు 27 సీట్లు వస్తుండగా, మహాకూటమికి 13 సీట్లే వస్తాయి. బీజేపీకి 22 శాతం, కాంగ్రెస్కు 8 శాతం, ఆర్జేడీకి 25 శాతం, జేడీయుకు 20 శాతం, ఇతరులకు 25 శాతం ఓట్లు వస్తాయి.
మహారాష్ట్రలో 48 స్థానాలు
48 స్థానాలు కలిగిన మహారాష్ట్రలో బీజేపీ 22, కాంగ్రెస్ 9, శివసేన 8, ఎన్సీపీ 9 స్థానాల్లో గెలుస్తుందని సర్వే తెలిపింది. బీజేపీ, శివసేనలు వేర్వేరుగా పోటీ చేస్తే ఈ ఫలితాలు ఉంటాయి. ఓటు శాతం విషయానికి వస్తే బీజేపీకి 28, కాంగ్రెస్కు 19, శివసేనకు 18, ఎన్సీపీకి 18, ఇతరులకు 17 శాతం రానుంది. 2014లో ఇక్కడ బీజేపీ 23 సీట్లు గెలిచింది.
జార్ఖండ్ 14, గోవా 2 సీట్లు
జార్ఖండ్లోని 14 సీట్లకు గాను బీజేపీ 7, కాంగ్రెస్ 2, జార్ఖండ్ ముక్తీ మోర్చా 4, జార్ఖండ్ వికాస్ మోర్చా 1 సీటు గెలుచుకోనుందని ప్రీపోల్ సర్వేలో వెల్లడైంది. ఇక్కడ 2014లో బీజేపీ 12 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. బీజేపీ ఓటు బ్యాంకు గతంలో 41 శాతం ఉండగా, ఈసారి 32 శాతంగా ఉండనుంది. ఇక గోవాలో 2 సీట్లు ఉండగా కాంగ్రెస్, బీజేపీలు చెరో స్థానం గెలుచుకోనున్నాయి. బీజేపీకి 49 శాతం, కాంగ్రెస్ పార్టీకి 43 శాతం, ఇతరులకు 8 శాతం ఓట్లు రానున్నాయి. మొత్తంగా ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి బీజేపీకే ఎక్కువ సీట్లు వస్తాయని తేలింది. కానీ గతంలో కంటే సీట్లు తగ్గనున్నాయి. గతంలో ఒక్క యూపీలోనే డెబ్బైకి పైగా సీట్లను బీజేపీ గెలిచింది. ఇప్పుడు ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి 83కు పైగా సీట్లు వస్తాయని తేలింది.