ఇండియా వర్సెస్ పాక్ ట్వీట్: ఆ ట్వీట్ను తొలగించాలంటూ ట్విటర్ను కోరిన ఈసీ, కపిల్ రియాక్షన్
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఎన్నికల వాతావరణం నెలకొన్న వేళ... ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా చేసిన వివాదాస్పద ట్వీట్ను తొలగించాల్సిందిగా ఎన్నికల సంఘం ట్విటర్ యాజమాన్యాన్ని కోరింది. ఢిల్లీలో జరిగే ఎన్నికలు భారత్ పాక్ మధ్య పోటీలా చూడాలని వివాదాస్పద ట్వీట్ చేశారు. ఢిల్లీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కేంద్ర ఎన్నికల సంఘానికి వివాదాస్పద ట్వీట్ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని లేఖ రాయడంతో ఈసీ ఈ మేరకు ట్విటర్ను కోరింది.
వివాదాస్పద ట్వీట్ చేసిన బీజేపీ నేత కపిల్ మిశ్రాకు ఢిల్లీ ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసిందని ఈసీ తెలిపింది. కపిల్ మిశ్రా మోడల్ టౌన్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. అంతకుముందు కపిల్ మిశ్రా అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఫిబ్రవరి 8న జరిగే ఎన్నికలను ఢిల్లీలో జరిగే భారత్ పాక్ పోటీగా చూడాలని ట్విటర్లో రాసుకొచ్చారు. పౌరసత్వ సవరణ చట్టంపై విపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో విపక్ష పార్టీలు పాకిస్తాన్ వ్యవహరించేలా వ్యవహరిస్తోందని బీజేపీ మండిపడింది.
ఇదిలా ఉంటే ఢిల్లీ ఎన్నికల సంఘం నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్న కపిల్ మిశ్రా స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసినవి కావని సాధారణ ఉద్దేశంతోనే వ్యాఖ్యలు చేసినట్లు చెప్పారు. పైగా ఈ వ్యాఖ్యలు బహిరంగ సభల్లో కానీ ప్రచారంలో కానీ చేయలేదని సమాధానం ఇచ్చారు.
माननीय चुनाव आयोग के नोटिस को मेरा जवाब 👇 pic.twitter.com/7eT7YqoUAJ
— Kapil Mishra (@KapilMishra_IND) January 24, 2020
ఇక ఒకరి వ్యక్తిగత పేరు, కులం, మతం, భాషను లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు కాదని చెప్పారు. అంతేకాదు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కూడా ఈ వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. తన వ్యాఖ్యలను కేవలం రెండు దేశాలను ఉద్దేశించి మాత్రమే చేసినట్లు సమర్థించుకున్నారు కపిల్ మిశ్రా. తన వ్యాఖ్యలపై షాహీన్ బాగ్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయని అయితే షాహీన్ బాగ్ తన నియోజకవర్గం కిందకు రాదని , అక్కడి వారు తన ఓటర్లు కాదని కపిల్ మిశ్రా తన సమాధానంలో పేర్కొన్నారు.