ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ వాకౌట్ - ఎస్సీఓ సదస్సులో పాకిస్తాన్పై నిరసన - కల్పిత మ్యాప్ చూపడంతో
అంతర్జాతీయ వేదికపై దాయాది పాకిస్తాన్ తీరును తీవ్రంగా ఎండగడుతూ భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ అనూహ్య చర్యకు దిగారు. రష్యా రాజధాని మాస్కో వేదికగా జరుగుతోన్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సులో భాగంగా మంగళవారం సభ్య దేశాల జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)ల సమావేశం జరగ్గా.. అందులో నుంచి ఆయన వాకౌట్ చేశారు.
అడ్డంగా దొరికిన మోదీ - చైనా పేరెత్తడానికి భయమెందుకు?: రాజ్నాథ్ ప్రకటనపై రాహుల్ గాంధీ
ఎన్ఎస్ఏల సదస్సులో పాకిస్తాన్ .. కల్పిత మ్యాప్ను చూపడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. మన భూభాగాన్ని తనవిగా చెప్పుకుంటూ పాక్ కల్పిత మ్యాపును ప్రదర్శించడంపై అజిత్ దోవల్ మండిపడ్డారు. నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది.
ఆతిథ్య దేశం రష్యా సూచనల్ని సైతం లెక్క చేయకుండా ఎన్ఎస్ఏల భేటీలో పాకిస్తాన్ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, తప్పుడు మ్యాప్ లు ప్రదర్శించి సమావేశ నిబంధనలను ఉల్లంఘించిందని, పాక్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూనే.. రష్యాతో సంప్రదించిన తర్వాతే భారత్ నిరసనగా వాకౌట్ చేసిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు.
పాకిస్తాన్ తీరుపై ఆతిథ్యదేశం రష్యా సైతం అసహనం వ్యక్తం చేసింది. పాక్ తీరు ఇండియాను రెచ్చగొట్టేలా ఉందని, దీనికి తాము మద్దతు ఇవ్వబోమని, రష్యా ఎన్ఎస్ఏ సెక్రటరీ నికోలయ్ పత్రుషేవ్ వ్యాఖ్యానించారు. ఈ వివాదం ప్రభావం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ తదుపరి సమావేశాలపై పడబోదని, మిగతా భేటీల్లో భారత్ పాల్గొంటుందనే ఆశిస్తున్నామని నికోలయ్ అన్నారు.
లవ్ పేరుతో దగ్గరై సెక్స్ వీడియోలు - ఏడుగురు అమ్మాయిలకు నరకం - వ్యాపారి అకృత్యాలపై సిట్ ఏర్పాటు
జమ్మూకాశ్మీర్, లదాక్, గుజరాత్ లోని కొన్ని భూభాగాలను తనవిగా చెప్పుకుంటూ పాకిస్తాన్.. ఆగస్టు 4న కొత్త పొలిటికల్ మ్యాప్ను విడుదల చేయగా.. ఆ చర్యను భారత్ ఖండించింది. మంగళవారం నాటి ఎన్ఎస్ఏల భేటీలో మళ్లీ అదే మ్యాపును ప్రదర్శించి పాక్ తన తెంపరితనాన్ని చూపింది. అందుకు నిరసనగానే భారత్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు.