ఆగని చైనా దురాక్రమణ.. ఏ పరిస్థితి ఎదురైనా భారత్ రెడీ.. 'స్టేటస్ కో'పై గట్టి వార్నింగ్ : రాజ్నాథ్
భారత్-చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు సమస్య ఇప్పటికీ అపరిష్కృతంగానే ఉందన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇప్పుడున్న వాస్తవాధీన రేఖ(LAC) వెంబడి సరిహద్దులు స్పష్టంగా లేవని చైనా నమ్ముతోందని... కానీ స్టేటస్ కోని ఫాలో కావాల్సిందేనని తాము హెచ్చరించినట్లు రాజ్నాథ్ తెలిపారు. ఎల్ఏసీ వెంబడి చోటు చేసుకునే ఏ చర్య అయినా ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఇప్పటికైతే ఇరు దేశాలకు అంగీకారప్రాయమైన పరిష్కారం ఏదీ దొరకనప్పటికీ... సరిహద్దులో శాంతిని నెలకొల్పేందుకు రెండు దేశాలు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయని తెలిపారు.
Recommended Video
చైనాకు వార్నింగ్... సక్సెస్...
వాస్తవాధీన రేఖ పట్ల అవగాహనలో అటు చైనా,ఇటు భారత్ భిన్న దృక్పథాలతో ఉన్నట్లు రాజ్నాథ్ తెలిపారు.దీనిపై కేంద్ర ప్రభుత్వం పలు ఇంటలిజెన్స్ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతోందన్నారు. గత ఏప్రిల్ నుంచి ఎల్ఏసీ వెంబడి చైనా తమ బలగాలను పెంచుకుంటూ పోతుందని అన్నారు. సరిహద్దులో చైనా దుందుడుకు చర్యలను నియంత్రించేలా దౌత్యపరంగా,మిలటరీ పరంగా భారత్ ఇచ్చిన వార్నింగ్ విజయవంతమైందన్నారు.ఏకపక్షంగా స్టేటస్ కోని మార్చే ప్రయత్నం చేస్తే ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘించినట్లేనని చైనాను హెచ్చరించినట్లు తెలిపారు.
భారత్ నుంచి గట్టి కౌంటర్
గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా బలగాలు దుందుడకు చర్యలకు పాల్పడ్డాయని రాజ్నాథ్ పేర్కొన్నారు. అయితే భారత్ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. తూర్పు లదాఖ్లోని గోగ్రా,కొంగ్కా లా,పాంగాంగ్ దక్షిణ తీరం,పాంగాంగ్ ఉత్తర తీరం వెంబడి చైనా తమ బలగాలను పెద్ద ఎత్తున మోహరించిందన్నారు. దానికి కౌంటర్గా భారత్ కూడా అంతే స్థాయిలో మన బలగాలను మోహరించిందన్నారు. సరిహద్దులో భారత్ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉందని స్పష్టం చేశారు.
రాజీపడే ప్రసక్తే లేదు...
భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతను కాపాడటానికి సరిహద్దులో కాపలాగా ఉన్న సాయుధ బలగాలకు అండగా నిలిచే ఈ తీర్మానాన్ని ఆమోదించమని లోక్సభ సభ్యులకు రాజ్నాథ్ విజ్ఞప్తి చేశారు. రష్యాలోని మాస్కో వేదికగా షాంఘై కోఆపరేషన్ సదస్సులో చైనా విదేశాంగ మంత్రితో భేటీ సందర్భంగా భారత వైఖరిని స్పష్టంగా వెల్లడించినట్లు తెలిపారు. సరిహద్దు నిర్వహణ పట్ల భారత బలగాలు ఎప్పుడూ బాధ్యతాయుతంగా మెలుగుతున్నాయని... అయితే దేశ సమగ్రను,సార్వభౌమత్వాన్ని కాపాడుకునే విషయంలో ఏమాత్రం రాజీపడేది లేదని స్పష్టం చేసినట్లు తెలిపారు.
ఆగని చైనా దురాక్రమణ...
జూన్ 15న తూర్పు లదాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి భారత్-చైనా బలగాల మధ్య చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణలో చైనా భారీ నష్టాన్ని చవిచూసిందన్నారు రాజ్నాథ్. లదాఖ్లో చైనా దాదాపు 38000 చదరపు కి.మీ భూభాగాన్ని ఆక్రమించుకుందని రాజ్నాథ్ పేర్కొన్నారు. గతంలో ఇలాంటి ఉద్రిక్తతలను శాంతియుతంగా పరిష్కరించుకున్నామని రాజ్నాథ్ గుర్తుచేశారు. అయితే ఇప్పటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నప్పటికీ... ఇప్పటికీ శాంతియుత సామరస్యానికే తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.