2009లో భారత్ ఏకాకి, ఇప్పుడు ప్రపంచ దేశాల మద్దతు: రాహుల్కు సుష్మా స్వరాజ్ దిమ్మతిరిగే కౌంటర్
న్యూఢిల్లీ: జైష్ ఏ మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చైనా అధ్యక్షుడికి మోడీ భయపడుతున్నారని, అందుకే మసూద్ విషయంలో ఇలా జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించగా, బీజేపీ ధీటుగా స్పందిస్తోంది. తాజాగా కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ నిప్పులు చెరిగారు. ఇది 2009 భారత్ కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
ముంబై బ్రిడ్జి ప్రమాదం: బీజేపీ నేత సంజు వర్మ సంచలన వ్యాఖ్యలు
రాహుల్ గాంధీకి సుష్మా కౌంటర్
ప్రధాని మోడీ బలహీనమైన వ్యక్తి అని, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ను చూసి ఆయన భయపడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై సుష్మ స్పందించారు. కాంగ్రెస్ హయాంలో మసూద్ అజహర్ ప్రతిపాదన తీసుకు వచ్చినప్పుడు భారత్ ఒంటరిగా ఉందని, కానీ ఇప్పుడు ప్రపంచ దేశాలు మనకు మద్దతిస్తున్నాయని అన్నారు.
2009లో భారత్ ఒక్కటే.. ఇప్పుడు భారత్ వెనుక దేశాలు
మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలో తీసుకు వచ్చిన ప్రతిపాదనకు సంబంధించి కొన్ని నిజాలు మీకు తెలియజేయాలని, ఈ ప్రతిపాదన నాలుగుసార్లు చర్చకు వచ్చిందని, 2009లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భారత్ ఒంటరిగా ఈ ప్రతిపాదన చేసిందని, 2016లో మన ప్రతిపాదనకు అమెరికా, ఫ్రాన్స్, యూకే మద్దతిచ్చాయిని, 2017లో అమెరికా, యూకే, ఫ్రాన్స్ ప్రతిపాదన తెచ్చాయని, 2019లో మరోసారి అమెరికా, ఫ్రాన్స్, యూకే మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ప్రతిపాదన తీసుకు వచ్చాయని, భద్రతామండలిలోని 15 సభ్య దేశాల్లో 14 మద్దతు ఇచ్చాయని తెలిపారు.
నిజాలు తెలుసుకోండి
భద్రతా మండలిలో సభ్యత్వంలేని ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇటలీ, జపాన్ లాంటి దేశాలు కూడా మద్దతు పలికాయని సుష్మా స్వరాజ్ తెలిపారు. దౌత్యపరంగా భారత్ విఫలమైందని విమర్శించే వారు నిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు. 2009లో భారత్ ఒంటరిగా ఉందని, కానీ 2019లో మనకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించిందన్నారు.