స్ట్రాంగ్ వార్నింగ్ : భారత్లో పాక్ మరో ఉగ్రదాడికి దిగితే ఏం చేస్తామో తెలుసా..?
ఢిల్లీ: భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత్ పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక జారీ చేసింది. పాకిస్తాన్ నుంచి భారత్పై మరో ఉగ్రదాడి జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని వెల్లడించింది. ఈసారి అన్ని ఆప్షన్స్ను వినియోగించి పాక్కు తగిన రీతిలో గుణపాఠం చెబుతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ ఎలా వ్యవహరిస్తుందో అనేదానిపైనే ఆదేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని భారత ప్రభుత్వం పేర్కొంది.
పాక్ దిగొచ్చింది: మసూద్ అజర్ సోదరుడు, బావమరిదిని అరెస్టు చేసిన పాకిస్తాన్
బాలాకోట్లో భారత వైమానిక దళం చేసిన దాడులకు ప్రతీకారంగా పాకిస్తాన్ తమ ఎఫ్16 యుద్ధ విమానాలను భారత్పై దాడుల కోసం పంపింది. దీనికి సంబంధించిన రుజువులు భారత్ సేకరించి ఆ సమాచారంను అమెరికాకు చేరవేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ విషయంపై అమెరికా కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. బాలాకోట్దాడులు జరిగిన సమయం నుంచి పాకిస్తాన్పై ఉగ్రవాదం అంశంలో భారత్ తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోందని వినికిడి.
ఇదిలా ఉంటే పాకిస్తాన్ తన అమాయకత్వాన్ని నిరూపించుకునే పనిలో అన్ని దేశాల వద్ద మొసలి కన్నీరు కారుస్తోంది. కానీ పాక్ పప్పులు ఎక్కడా ఉడకలేదు. ప్రపంచదేశాలు భారత్ వైపే నిలిచి పాక్కు కర్రతో వాతపెట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాల్సిందే అని ప్రపంచదేశాలు పాక్కు హుకూం జారీచేశాయి. జైషే మహ్మద్ ఛీఫ్ మసూద్ అజహర్ను ఐక్యరాజ్యసమితి బ్యాన్ చేస్తేనే పాక్పై తీవ్ర ఒత్తిడి వస్తుంది. ఎందుకంటే మసూద్ అజహర్ పాక్లో నివసిస్తున్నారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రే చెప్పారు.
ఇదిలా ఉంటే పశ్చిమ భారత్లోని అన్ని ఎయిర్ ఫోర్స్ బేస్లను ప్రభుత్వం అలర్ట్ చేసినట్లు సమాచారం. ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం చేసిన బాలాకోట్ దాడులకు ప్రతీకారం తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఎయిర్బేస్లను అలర్ట్ చేసింది. ఫిబ్రవరి 27న పాకిస్తాన్ భారత మిలటరీ స్థావరాలపై దాడులు చేసేందుకు ప్రయత్నించింది.