2020లోనే చంద్రయాన్-3: ‘చంద్రుడిపై ఇండియా ల్యాండ్’ అంటూ కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 ప్రయోగంపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 చివరి నిమిషంలో సాంకేతిక లోపంతో విఫలమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత చంద్రుడిపై తమ పరిశోధనలు ఆగవని, మరో ప్రయోగం(చంద్రయాన్-3) చేసి విజయవంతమవుతామని ఇస్రో కూడా ఇప్పటికే ప్రకటించింది.
2020లో చంద్రయాన్-3..
ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తాజాగా చంద్రయాన్-3 ప్రయోగంపై స్పందించారు. 2020లో చంద్రయాన్-3 ప్రయోగం ఉంటుందని ఆయన స్పస్టం చేశారు. చంద్రయాన్-3 ఈసారి విజయవంతమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మన శాస్త్రవేత్తలు ఇప్పటికే ఇందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు.
ఈసారి ప్రయోగం విజయవంతమే..
‘అవును. 2020లో మరోసారి ల్యాండర్, రోవర్ ప్రయోగం జరుగుతుంది. చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైందని చెప్పలేం. దాన్నుంచి మనం చాలా నేర్చుకున్నాం. ఏ దేశమూ మొదటి ప్రయత్నంలోనే చంద్రుడిపై కాలు మోపలేదు. అమెరికా ఎన్నోసార్లు ప్రయత్నించింది' అని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. ఈసారి చంద్రయాన్ ప్రయోగం విజయవంతమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండ్ అవడంతోనే..
2019, సెప్టెంబర్ 7న విక్రమ్ ల్యాండర్ను చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సిన సమయంలో హార్డ్ ల్యాండింగ్ అయ్యింది. దీంతో విక్రమ్ ల్యాండర్తో ఇస్రోకు సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో చంద్రయాన్-2 విజయవంతం కాలేకపోయిందని ఇస్రో ప్రకటించింది. విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండ్ అవడంపై పార్లమెంటులో మంత్రి జితేంద్ర అధికారిక ప్రకటన చేశారు. కాగా, తమ ప్రయోగం విఫలం కాలేదని ఇస్రో కూడా స్పష్టం చేసింది. చంద్రయాన్-2 సక్సెస్ కాకపోవడంతో ఇస్రో ఛైర్మన్ శివన్ కంటతడి పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆయనను ప్రధాని నరేంద్ర మోడీ ఓదార్చారు.
ఇస్రో కూడా సిద్ధంగానే..
కాగా, ప్రతిపాదిత చంద్రయాన్-3 ప్రయోగం కోసం నివేదికను తయారు చేయాలని విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ డైరెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఇస్రోను కోరినట్లు సమాచారం. చంద్రయాన్-3 ప్రయోగం ఉంటుందని ఇప్పటికే ఇస్రో స్పష్టం చేసింది. చంద్రయాన్-2లో జరిగిన పొరపాట్లను జరగకుండా విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు అహర్నిశలు కృషి చేస్తున్నారని ప్రకటించింది. కాగా, 2020కి ఇస్రో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. డజనుకుపైగా కీలక ఉపగ్రహాలను నింగిలోకి పంపేందుకు నిర్ణయించింది. అంతేగాక, ప్రతిష్టాత్మకమైన ఆదిత్య(సూర్యుడు) మిషన్ కూడా ఇస్రో లక్ష్యాల్లో ఉండటం గమనార్హం.