భారత్లో జీ20 సమ్మిట్: ఎప్పుడంటే? ఓ ఏడాది వెనక్కి వెళ్లినట్టే: ప్రధాని కీలక ప్రసంగం
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ-20 హై ప్రొఫైల్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఇదివరకు నిర్ణయించిన షెడ్యూల్ కంటే ఒక ఏడాది ఆలస్యంగా భారత్ ఈ సమ్మిట్ను నిర్వహించనుంది. మొదట్లో 2022లో ఈ సదస్సును నిర్వహించాలని నిర్ణయించుకోగా.. అది కాస్తా 2023కి మారింది. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్ను జీ20 నిర్వాహక దేశాలు దాదాపుగా ఖరారు చేసినట్టే. నిజానికి- 2022లో జీ 20 సదస్సును నిర్వహించాలని ఇంతకుముందు నిర్ణయించారు.
Recommended Video
కరోనా జన్మ రహస్యంపై కొత్త గుట్టును విప్పిన చైనా వైరాలజిస్ట్: ఆ ల్యాబ్తో నో లింక్: గబ్బిలాలపై
తాజాగా ఇందులో మార్పులు చోటు చేసుకున్నాయి. భారత్ స్థానంలో ఇండొనేషియా వచ్చి చేరింది. 2022లో నిర్వహించబోయే జీ-20 సదస్సును ఇండోనేషియాలో నిర్వహిస్తారు. ఆ మరుసటి ఏడాది సమ్మిట్కు భారత్ ఆతిథ్యాన్ని ఇచ్చేలా షెడ్యూల్ను పునఃసమీక్షించినట్లు తెలుస్తోంది. తాజా మార్పుల ప్రకారం.. 2021 జీ20 సదస్సును ఇటలీ, 2022 సమ్మిట్ను ఇండోనేషియాలో నిర్వహిస్తారు. జీ 20 సమ్మిట్-2023ని భారత్లో ఏర్పాటు చేస్తారు. 2024 సమ్మిట్.. బ్రెజిల్లో ఉంటుంది.
సౌదీ అరేబియాలోని రియాద్లో నిర్వహించిన జీ20 సదస్సులో ఈ మేరకు ఓ డిక్లరేషన్ చేశారు. జీ20 రియాద్ సమ్మిట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరిచారు. కాగా- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రియాద్ జీ-20 సమ్మిట్ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. వర్చువల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. ఇదివరకు పారిస్లో నిర్వహించిన సదస్సు ఒప్పందాలను లక్ష్యాన్ని భారత్ అందుకుంటోందని చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాము ప్రజల ప్రాణాలనే కాదు.. ఆర్థిక వ్యవస్థను కూడా కుప్పకూలకుండా కాపాడుకుంటున్నామని చెప్పారు. వాతావరణ మార్పులపై రూపొందించిన ఒప్పందాలను ప్రతి దేశం అనుసరించాల్సి ఉంటుందని, అప్పుడే సురక్షితమైన ప్రపంచాన్ని ముందు తరాలకు అప్పగించినట్టవుతుందని మోడీ అన్నారు. భవిష్యత్ తరాలను వాతావరణ మార్పు శాసించే స్థాయికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కర్బన్ ఉద్గారాలను వీలైనంత మేర నియంత్రించాల్సి అవసరం ఉందని చెప్పారు. భారత్ దీన్ని పాటిస్తోందని ప్రధాని తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేలా అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన కూటమి దేశాలు సమర్థవంతంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలను నియంత్రించడంలో ఈ కూటమి దేశాల పాత్ర కీలకంగా మారిందని చెప్పారు. కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి అలాంటి వినూత్న ఆలోచనలను అభివృద్ధి చేసుకోవాల్సి అవసరం ఉందని అన్నారు.